పార్లమెంటులో హోదా డిమాండ్కు బలం తగ్గుతుందా?
నోట్ల రద్దు నేపథ్యంలో జరుగుతున్న రగడ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనూహ్యమైన ఓ చిన్న నష్టం జరగనుంది. సాధారణంగా నోట్ల రద్దు తదనంతర పరిణామాలు అనగానే.. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, కొత్త సమస్యలు మాత్రమే మన దృష్టికి వస్తాయి. అయితే అనూహ్యమైన రీతిలో ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే నిమిత్తం.. పార్లమెంటులో ఈ శీతాకాల సమావేశాల్లో ఎంతో కొంత స్థాయిలో జరుగుతుందని అనుకుంటున్న పోరాటం.. కాస్త పలుచన అయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా గురించి గట్టిగా తమ గళం వినిపించాలని నిర్ణయించుకుంది. సమావేశాల సమయంలో పార్లమెంటులో పోరాడి, అవసరమైతే తర్వాత తమ ఎంపీ పదవులకు రాజీనామాలైనా చేస్తాం అని వారు ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం నుంచి లోక్ సభలో సభ్యత్వం లేకపోయినా, తమ పార్టీ ఢిల్లీ పెద్దల ద్వారానూ, రాజ్యసభలోని సభ్యుల ద్వారానూ ప్రత్యేక హోదా ను లేవనెత్తి జనం దృష్టిలో పడాలని వారు కూడా కోరుకుంటున్నారు.
అయితే అనుకోకుండా కొన్ని రోజుల కిందట తెరమీదికి వచ్చిన ఈ ‘నోట్ల రద్దు, తదనంతర ప్రజల కష్టాలు’ అనే సబ్జెక్టు దెబ్బకి ప్రత్యేకహోదా డిమాండు వెనక్కిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
ఎన్డీయేతర పక్షాలు నోట్ల రద్దు అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడానికి , మోదీ సర్కారును ఇరుకున పెట్టడానికి తమ వంతు ప్రయత్నాల్లో తాము ఉన్నాయి. అన్ని పార్టీలు ఒక్క తాటి మీదకు వస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోదీ చాలా స్పష్టంగా తెగేసి చెబుతున్నప్పటికీ.. దీన్ని పార్లమెంటులో ప్రస్తావించడం ద్వారా.. రభస సృష్టించాలనే ఆలోచన ప్రతిపక్షాల వైఖరిలో కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు ఏపీ కోరిక గురించి అసలు పట్టించుకునే ఛాన్సులేదు. అలాగే వైకాపా వారి నినాదాలు కూడా మరుగున పడిపోయే అవకాశం ఉంది. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేకహోదా పోరాటం ఏ మాత్రం ఒత్తిడి చూపించే అవకాశం లేదని, కనీసం ఇదివరకటి లాగా నలుగురి దృష్టిని ఆకర్షించడం కూడా జరగకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు.