పాక్ ముప్పు హెచ్చరిక : హస్తిన పెద్దలకు భద్రత!

భారత సర్జికల్ దాడుల పట్ల పాకిస్తాన్ ఎలా స్పందించబోతున్నది? ఇది మన జాతి ముందున్న మిలియన్ డాలర్ ప్రశ్న. పాక్ స్పందన ఏ రూపంలో ఉన్నప్పటికీ దానిని సమర్థంగా తిప్పికొట్టడానికి భారత ప్రభుత్వం, సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. అయితే ఇలాంటి సంక్లిష్ట సమయంలో.. ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలపై దాడులు జరిగే అవకాశం ఉందని, పాక్ నుంచి ముప్పు పొంచి ఉందని కొత్తగా ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హస్తిన పెద్దలకు భద్రత పెంచుతూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు కొత్తగా భద్రత బాగా పెంచారు. పాకిస్తాన్ అనుకూల శక్తులనుంచి సరిహద్దుల్లో ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు గానీ.. ఇలా వ్యక్తులను టార్గెట్ చేస్తే పరిస్థితి తడబడకుండా ఉండేందుకు వీరికి భద్రత పెంచారు.
పాకిస్తాన్ నుంచి ప్రతీకార దాడులు జరగవచ్చునని ఐబీ హెచ్చరించడంతో ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

