నోట్ల దెబ్బ : ఇదొక భూకంపం అంటున్న మోదీ
పెద్ద నోట్ల రద్దు అనే నిర్ణయానికి భారత జాతి యావత్తూ అతలాకుతలం అయిపోతున్న సంగతి అందరికీ స్వానుభవంలో ఉన్నదే. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్రాన్ని విపక్షాలు మినహా ప్రజలు పరిమితంగానే నిందిస్తూ.. తమ కష్టాలు తాము పడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన స్వదేశంలో ప్రజలు పడుతున్న కష్టాలను భూకంపంతో సమానంగా అభివర్ణించారు. 2011లో జపాన్ లో పెను భూకంపం సంభవించిన తర్వాత ఏర్పడిన విపత్కర పరిస్థ్థితులను అక్కడి ప్రజలు ఎలా ఎదుర్కొన్నారో.. ప్రస్తుతం భారతదేశంలో ప్రజలు కూడా ఈ ఆకస్మిక నిర్ణయం వలన ఎదురవుతున్న అనేక రకాల కష్టాలను సహిస్తూ సహకరిస్తున్నారని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు, ఆస్పత్రి అవసరాలకు ఇబ్బందులు వస్తున్నా, దైనందిన అవసరాలకు ఇబ్బందులు వస్తున్నా, రోజుకు ఆరేడు గంటలు క్యూలైన్లలో నిల్చుని డబ్బు మార్చుకోవడానికి పాటుపడుతున్న తన దేశ ప్రజలు తన నిర్ణయాన్ని కష్టాలు పడుతూనే ఆశీర్వదిస్తున్నారని మోదీ అన్నారు.
అయితే జపాన్ లో మోదీ ప్రసంగంలో నల్లకుబేరులకు మరో ప్రధానమైన హెచ్చరిక కూడా ఉన్నది. నల్లడబ్బు అరికట్టడానికి జరిగే ప్రయత్నాలు డిసెంబరు 30 వ తేదీతో అంతా అయిపోయినట్లు అనుకోవడానికి వీల్లేదని ఆ తర్వాత కూడా నల్లడబ్బు అరికట్టే ప్రయత్నాలు కొనసాగుతాయని మోదీ పరోక్ష హెచ్చరిక చేయడం విశేషం. లెక్కల్లో చూపని డబ్బు పెద్ద మొత్తాల్లో బయటకు వస్తే.. అవసరం అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి ఆ డబ్బుకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తాం అని ఎంతటి వారినైనా వదలిపెట్టేది లేదని మోదీ అంటున్నారు. నిజాయితీ పరులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, నల్లకుబేరుల భరతం పట్టడానికి కొత్త చర్యలు కూడా ఉంటాయని మోదీ అంటున్నారు.
అవినీతి , నల్లధనం నియంత్రణకు మోడీ తీసుకుంటున్న చర్యలు హర్షణీయమైనవే అయినప్పటికీ, ఆయన ముందుగా ఈ అవనీతి నల్లధనం అనేవాటిని బ్యూరోక్రసీ, పరిపాలన యంత్రాంగం, రాజకీయ వ్యవస్థల్లో శుద్ధిచేసి, ఆతర్వాత ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాల జోలికి వచ్చి ఉంటే బాగుండేదని ప్రజలు భావిస్తున్నారు.