నెల్లూరు నేతలంతా ఒక్కటై...జగన్ వెంట నడుస్తూ....!

నెల్లూరు జిల్లాలో జగన్ యాత్ర జనసంద్రంగా మారింది. నెల్లూరు జిల్లాలో నేతలు అంతా ఒక్కటిగా కలిసి నడుస్తున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారన్న వదంతులు జోరుగా విన్పించాయి. అయతే వీటన్నింటినీ కాదంటూ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జగన్ పాదయాత్ర వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం చెప్పారు. జగన్ వెంట నడిచారు. జగన్ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
విభేదాలను పక్కన పెట్టి....
గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వైసీపీకి అండగా నిలిచింది. అయితే వైసీపీ నుంచి గెలిచిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వైసీపీ నుంచి గెలిచి పార్టీని వీడారు. అక్కడ వెంటనే నియోజకవర్గ సమన్వయ కర్తగా మేరిగ మురళిని నియమించారు. ఇక నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు తలెత్తాయని కూడా ప్రచారం జరిగింది. ఎంపీ మేకపాటి కొందరు ఎమ్మెల్యేలకు వత్తాసు పలుకుతున్నారని ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. అయితే జగన్ పాదయాత్రలో ఎమ్మెల్యేలందరూ కలిసి పాల్గొన్నారు. తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, ఎమ్మెల్యేలు సంజీవయ్య, కాకాణి గోవర్థన్ రెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పాదయాత్రను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఎటు చూసినా జనసందోహమే....
ఇక నెల్లూరు జిల్లాలో జగన్ అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎటు చూసినా జనసందోహమే కన్పిస్తోంది. నాయుడుపేటలో జరిగిన పాదయాత్రకు నిల్చోవడానికి కూడా చోటు లేకుండా ఉంది. మేడల మీద నుంచి జగన్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు. మహిళలు కర్పూర హారతులతో జగన్ కు స్వాగతం పలికారు. కొందరు ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్ బొమ్మతో మిద్దెలమీద నుంచొని జగన్ కు చూపించడం కన్పించింది. ఇక పాదయాత్ర చేస్తున్న వారికి మహిళలు తమ ఇళ్లల్లో నుంచి మజ్జిగ తెచ్చి ఇవ్వడం కన్పించింది. నాయుడుపేట నుంచి పూట క్రాస్ రోడ్స్, వర్ధరెడ్డి కండ్రిగ, పునేపల్లి, నేమలపూడి, సగట్టురు వరకూ యాత్ర కొనసాగింది. ప్రతి చోటా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జగన్ ను పలకరించడం కన్పించింది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో జగన్ పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుంది.
- Tags
- జగన్

