Thu May 16 2024 17:31:22 GMT+0000 (Coordinated Universal Time)
నీటి కోసం రెండు రాష్ట్రాల పంచాయతీ తెగలేదా?
కృష్ణా జలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్వహణ విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు. నాగార్జున సాగర్., శ్రీశైలం ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టానికి ఎగువన ఉన్న జలాలను పంచుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ హల్దర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు రాష్ట్రాల జలవనరుల ఉన్నతాధికారులు నదీ జలాల పంపిణీపై సుదీర్ఘంగా చర్చించారు. శ్రీశైలం., సాగర్ ప్రాజెక్టుల్లో మొత్తం 34 టిఎంసీల నీరు అందుబాటులో ఉండగా కనిష్ట నీటి మట్టాన్ని మినహాయించి ఏపీ 18.5 టిఎంసీలు., తెలంగాణ 15.5 టిఎంసీల నీటిని వాడుకోడానికి అంగీకారానికి వచ్చాయి.
విభిన్న వాదనలు....
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం జరిగిన కేటాయింపుల్లో తెలంగాణకు 299 టిఎంసిలు., ఏపీకి 512 టిఎంసిల ప్రాతిపదికన జలాల పంపిణీ జరగాలని తెలంగాణ కోరింది. దీని ప్రకారం తెలంగాణకు 37శాతం., ఏపీకి 64శాతం నీటి కేటాయింపు ఉందని., అదే నిష్పత్తిలో నీటి వినియోగం ఉండాలని తెలంగాణ డిమాండ్ చేసింది. అయితే చిన్న నీటి వనరుల వినియోగాన్ని పూర్తి కేటాయింపుకు తగ్గట్లుగా పరిగణించాలని ఏపీ డిమాండ్ చేసింది. దీనిని అంగీకరించకపోతే సాగర్., శ్రీశైలం వరకే కేటాయింపులకు పరిమితం కావాలని ఏపీ డిమాండ్ చేసింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. పట్టిసీమ నుంచి మళ్లించిన నీరుతో పాటు చిన్న నీటి వనరుల నుంచి వినియోగించిన నీటిని మినహాయిస్తే ఏపీ 244.83 టిఎంసిలు., తెలంగాణ 114.79 టిఎంసిల నీటిని వాడుకున్నట్లు బోర్డు లెక్క వేసింద్ి. పట్టిసీమ నీటిని మినహాయించడంపై తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి జోషి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లోను 37:63 నిష్పత్తిలో వినియోగం ఉండాలన్న తెలంగాణ వాదనతో ఏపీ ఏకీభవించకపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. బోర్డు ఆదేశాలను అమలు చేయడం లేదంటూ ఏపీ., తెలంగాణలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. శ్రీశైలం., సాగర్ల నుంచి న్యాయంగా రావాల్సిన నీటి విషయంలో ఏపీ అన్యాయంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ఆరోపిస్తే ., సాగర్ కుడికాల్వకు ఐదు టిఎంసిలు విడుదల చేయాలని బోర్డు ఆదేశించినా తెలంగాణ అమలు చేయలేదని ఏపీ ప్రత్యారోపించింది. చివరకు రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ అంగీకరించింది.
ఆరు నెలల్లో అసలు లెక్క.....
ప్రాజెక్టుల్లోకి ఎంత నీరు వస్తుంది., ఎంత నీరు వాడుతున్నారో లెక్కించారో తెలిపేందుకు తొలి దశలో 18, రెండో దశలో 28..., మొత్తం 46 టెలిమెట్రీ యంత్రాలను ఏర్పాటు చేయాలని బోర్డు ప్రతిపాదిస్తే., మరో 12 ప్రాంతాల్లో కూడా యంత్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. దీనిని ఏపీ వ్యతిరేకించింది అన్ని ప్రాంతాల్లో ఒకేసారి యంత్రాలు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ డిమాండ్ను బోర్డు అంగీకరించింది.
- Tags
- కృష్ణా జలాలు
Next Story