నాన్-సీరియస్ : జగన్ నల్లడబ్బు గురించి జనానికి టెన్షన్ !!
విపక్షనేత వైఎస్ జగన్మోహన రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా అక్రమాలకు పాల్పడ్డాడా? అడడ్డగోలుగా అక్రమ సంపాదన పెంచుకున్నాడా? ఇంతలోతు విషయాల మీద జనానికి ఎవ్వరికీ స్పష్టత లేదు. వాళ్లూ వీళ్లూ చెప్పుకుంటున్న దాన్ని బట్టి ఎవరైనా ఓ అభిప్రాయానికి రావాల్సిందే తప్ప.. వాస్తవం ఎవ్వరికీ తెలియదు. అయితే జగన్ వద్ద చాలా వేల కోట్లు, లక్ష కోట్లు క్యాష్ రూపంలో డబ్బు మూలుగుతున్నట్లుగా ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మాత్రం తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ ఆసక్తికరమైన చర్చకు, జనంలో సరదాగా జరుగుతున్న సంభాషణలకు కారణం అవుతోంది.
జగన్ వద్ద చాలా భారీ మొత్తాల్లో క్యాష్ రూపంలో డబ్బు నిల్వలు ఉన్నాయి.. అని తమకు ఖచ్చితంగా తెలియకపోయినా ‘అనుకుంటున్న’ జనం అనేక మంది ఉన్నారు. అయితే ఆ సొమ్మునంతా జగన్ ఇప్పుడు ఏం చేస్తారు? అనే విషయం మీద జనం ఎవరికి తోచింది వారు ఊహించుకుంటున్నారు.
సమాజంలో ఉన్న వ్యక్తులు ఎంతో కాలం నుంచి తాము జాగ్రత్తగా సేవ్ చేసుకున్న , లేదా హఠాత్తుగా వచ్చి పడగా ఇంట్లో ఉంచుకున్న 10, 20 లక్షల రూపాయలు ఉంటేనే దానికి ఇప్పుడు బ్లాక్ మనీ అనే ముద్ర పడుతూ ఉండడం జనాన్ని విస్మయపరుస్తోంది. దాన్ని వైట్ గా మార్చుకోవడానికి జనం కిందా మీదా అయిపోతున్నారు. తమ కుటుంబసభ్యుల అకౌంట్లలో ఒక్కొక్కరికి 2.5 లక్షల వంతున వేసుకుని, దాన్ని వైట్ గా మార్చుకోవాలని అనుకుంటున్నారు. జనం 10, 20 లక్షల మార్పిడికే ఇన్ని అవస్థలు పడుతుండగా.. తాము ఊహిస్తున్నది లేదా తెలుగుదేశం వాళ్లు ప్రచారం చేస్తున్నది నిజమై.. జగన్ వద్ద వేల కోట్ల రూపాయల నల్లధనం ఉన్నట్లయితే.. ఆయన బహుశా ఆ సొమ్మును ఎలా మార్చుకుంటారా? అనేది అందరికీ పెద్ద సస్పెన్స్ అయిపోతోంది.
జనం ఈ రోజుల్లో ఏ ఇద్దరు కలిసినా.. డబ్బు మార్పిడి , దానికి సంబంధించిన విషయాల గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. కాసేపు సంభాషణ గడవగానే ప్రతి ఒక్కరికీ సంభాషణ నల్ల కుబేరుల మీదికి, అక్కడినుంచి జగన్ మీదికి సంభాషణ మళ్లిపోతోంది. వందల వేల కోట్లలో సొమ్ములున్న వాళ్లంతా ఏం చేస్తారా అని ఎవరికి వారు రకరకాల జోకులు వేసుకుంటూ జనం సరదాగా మాట్లాడుకుంటున్నారు. జగన్ వద్ద ఖచ్చితంగా వేల కోట్ల నల్లడబ్బు ఉందంటున్న తెలుగుదేశం శ్రేణులో ఆయన ఏం చేయబోతున్నారో కూడా కొన్ని ఊహాగానాలను ప్రచారంలోకి తెస్తే.. జనానికి నాన్ సీరియస్ గా మాట్లాడుకోవడానికి ఇంకాస్త సబ్జెక్టు ఉంటుంది మరి.