తెలుగుపోస్ట్ కోరిక తీరింది : సర్కారీ నిర్ణయం భేష్!
నల్లధనం కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పట్ల ఎంతగా జనామోదం ఉన్నప్పటికీ.. వారి కష్టాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే అంతో ఇంతో జనానికి ఈ కష్టాలనుంచి కాస్త ఉపశమనం కలిగించడానికి కేంద్ర సర్కారు తాజాగా తీసుకున్న కొత్త నిర్ణయం శెభాష్ అనిపించే విధంగా ఉంది. నిజానికి మూడురోజుల కిందటే తెలుగుపోస్ట్ తన అభిప్రాయంగా, సూచనగా వ్యక్తంచేసిన అంశాలనే ప్రభుత్వం తాజాగా నిర్ణయాలుగా వెలువరించింది.
పాతనోట్లు మార్చుకునే విషయంలో జనం కష్టాలు ప్రభుత్వం ఊహించని రీతిలో మితిమీరి వెల్లువెత్తాయి. అవి స్వానుభవంలోకి వచ్చిన వెంటనే 8వ తేదీ నిర్ణయం తర్వాత.. 11వ తేదీ వరకు మాత్రమే పాతనోట్లు చెల్లేలా పెట్టిన నిబంధనల్ని కేంద్రం సవరించింది. 14వ తేదీ వరకు పాత నోట్లు చెల్లుబాటు అయ్యే పరిస్థితి కల్పించారు. అయితే... అది కూడా తక్కువ గడువే అని.. ప్రజలకు అనూహ్యమైన స్థాయిలో కొత్త కొత్త కష్టాలు అన్నీ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో... ఈ గడువును మరికొన్ని రోజుల పాటూ పొడిగించాల్సి ఉన్నదని తెలుగుపోస్ట్ తన కథనంలో సూచన చేసింది.
‘‘సర్కారు చేయాల్సింది ఇంకా చాలా ఉంది’’ అనే శీర్షికతో ఈనెల 11వ తేదీన ప్రచురించిన వార్తలో సర్కారు పాతనోట్ల చెల్లుబాటు గడువును మరికొన్ని రోజులు పొడిగించాలనే సూచన చేశాం. తాజాగా కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకుంది. ప్రజలకు అనూహ్యమైన కష్టాలు ఎదురవుతున్న నేపథ్యంలో , ప్రభుత్వ నిర్ణయానికి ఎంతో సహకరిస్తున్న వారికి కాస్త దన్నుగా ఉండేలా.. ఈనెల 24 వరకు కూడా పాత నోట్లు చెల్లేలా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రోజువారీ బ్యాంకుల్లో నగదు మార్పిడి పరిమితినుంచి 4000 నుంచి 4500 వరకు , కౌంటర్ ద్వారా విత్ డ్రా చేసే సొమ్ము పరిమితిని 24 వేల వరకు, ఏటీఎంల నుంచి ఒక రోజుకు 2500 వరకు విత్ డ్రా చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది.
నిజానికి పాతనోట్లు మరో పదిరోజుల బాటు చెల్లుబాటు అయ్యేలా కొత్త నిబంధన విధించడం వల్ల ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుందని అంతా అనుకుంటున్నారు. పెద్దనోట్లను మరిన్ని రోజులు మారేలా చేయడం గొప్ప ఉపశమనమే అని చెప్పాలి. దీనివల్ల ప్రతిచోటా జనం రద్దీలు తగ్గే అవకాశం కూడా ఉంది.