జై....జగన్ .... జై...జై... జన్మభూమి...!

జగన్ అజెండానే జన్మభూమి అజెండానా? అవును ఇది నిజమేననిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర గత యాభై నాలుగు రోజులుగా చేస్తున్నారు. ఇప్పటికే మూడు జిల్లాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. జగన్ పాదయాత్ర ద్వారా పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు వంటి సమస్యలను ఎక్కువగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అర్హులందరికీ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అంతేకాకుండా 45 ఏళ్లకే పింఛను ఇస్తానని చెబుతున్నారు. నిరుద్యోగ భృతి వెయ్యి నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతామని హామీలు గుప్పిస్తున్నారు.
పాదయాత్రలో వచ్చిన సమస్యలు...
అయితే జగన్ పాదయాత్రను నిశితంగా గమనిస్తున్న అధికార పార్టీ జన్మభూమి కార్యక్రమంలో ప్రజాసమస్యలను పరిష్కరించడంలో దృష్టిపెట్టింది. ముఖ్యంగా అర్హులైన వారందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు స్పష్టంగా అందాయి. ముఖ్యంగా రేషన్ కార్డులు అడిగిన వారికి అడిగినట్లు ఇచ్చేయమని ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ముఖ్యంగా ఆర్థికేతర సమస్యలను తక్షణమే అక్కడికక్కడే తీర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా అధికారులకు స్పష్టంగా చెప్పారు.
వ్యక్తిగత సమస్యలే ఎక్కువ....
జన్మభూమి ప్రారంభమై నాలుగురోజులయింది. ఎక్కవగా రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులు కోరుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. అయితే తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తే ప్రభుత్వ పథకాలన్నీ వారికి వర్తించి సర్కార్ ఖజానాపై భారం పడే అవకాశముంది. ఇందుకోసం తెల్ల రేషన్ కార్డుల జారీలో మాత్రం కొంత వెనుకంజవేస్తున్నారు. ఇక గులాబీ కార్డులు అడిగితే వెంటనే గ్రామసభలోనే వాటిని మంజూరుచేస్తున్నారు. ఇక పింఛన్ల విషయంలోనూ అధికారులు కొంత తటపటాయిస్తున్నారు. గ్రామానికి కావాల్సిన సామూహిక సమస్యలను మాత్రం వెంటనే చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. జగన్ పాదయాత్రలో కూడా ఎక్కువగా ఇటువంటి సమస్యలే వస్తుండటంతో వెంటనే వాటిని పరిష్కరించి... ప్రజల మన్ననలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జన్మభూమి ఓట్ల పండగలా మారిపోయిందన్న విమర్శలూ విన్పిస్తున్నాయి.
- Tags
- జగన్ జన్మభూమి

