చంద్రబాబు : మరో బృహత్ సంకల్పం !
ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు అభివృద్ధి పనుల విషయంలో వెనక్కు లాగుతున్నప్పటికీ.. చంద్రబాబునాయుడు మాత్రం.. కొత్తగా భారీ సంకల్పాలను భుజానికెత్తుకుంటూ కొన్ని ప్రగతి పనులను ముందుకు తీసుకువెళ్లడంలో పునరాలోచన చేయడం లేదు. గోదావరి – కృష్ణ నదులను అనుసంధానం చేయడం ద్వారా దేశంలోనే ఒక కొత్త అరుదైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మరో భారీ లక్ష్యం ఎంచుకుంటున్నారు. గోదావరి – పెన్నా నదులను అనుసంధానం చేయడం గురించి చంద్రబాబునాయుడు కొత్త టార్గెట్లు విధించుకుంటున్నారు. ఇది కూడా జరిగితే రాష్ట్రం మరింత విస్తీర్ణం సుస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంటుంది.
గోదావరి జలాలను పెన్నా నది ద్వారా రాయలసీమకు మళ్లించే పథకం రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాధాన్య క్రమంలో జలవనరుల పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం సీఎంఓలో సమీక్షించారు. అధికారులు సవివర నివేదిక తయారీలో భాగంగా ముఖ్యమంత్రికి ఒక నమూనా నివేదికను సమర్పించారు. తక్కువ వ్యయంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం కుడి కాల్వ నుంచి గోదావరి జలాలను బకింగ్ హామ్ కెనాల్ ద్వారా పెన్నా నదికి మళ్లించాలన్న ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించారు.
గోదావరి నుంచి వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిలో 3000 టీఎంసీలను నదుల అనుసంధానం ద్వారా పెన్నానదికి మళ్లించటానికి పథకాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు తాగు, సాగు నీరు అందటంతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత ఉంటుంది. బకింగ్ హామ్ కెనాల్ ద్వారా పెదగంజాం, సంగెం, సోమశిల ద్వారా నీటిని మళ్లిస్తారు. హెలికాప్టర్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇమేజింగ్, జియో మ్యాపింగ్ చేసి తక్కువ వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణంపై నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
గోదావరి పెన్నా నదుల అనుసంధానంతో కాల్వ సమీపంలో ఉన్న పట్టణాలకు నీరందించవచ్చు. గ్రామాల్లోని చెరువులను నింపటం మరో ఉద్దేశం. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రోజుకు 3.5 టీఎంసీల వంతున 400 టీఎంసీలను మళ్లించాలని ప్రతిపాదించారు..ఒక భారీ స్టోరేజీ జలాశయం నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఇది వ్యయంతో కూడినది కావటంతో వ్యయం తగ్గించే విధంగా రూపొందించాలని ముఖ్యమంత్రి కోరారు. ముందుగా రోజుకు3.5 టీఎంసీల నీటిని మళ్లించే విధంగా, తర్వాత సామర్ధ్యాన్ని 4.9 టీఎంసీలకు పెంచేవిధంగా ప్రతిపాదనలు తయారు చేశారు.
రాయలసీమకు నీరు
రెండునెలల్లో గుండ్లకమ్మ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో హంద్రీనీవా కాల్వ వెడల్పు పనులను వేగం పెంచాలని కోరారు. గండికోట నుంచి చిత్రావతికి తద్వారా కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సాగునీరు అందిచాలని, జనవరి నెలాఖరుకు చిత్రావతికి నీరు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కుప్పం బ్రాంచి కెనాల్కు నీరిచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. చంద్రబాబు సంకల్పిస్తున్న ఈ కొత్త ఆలోచనలు రూపుదాలిస్తే.. సేద్యపు నీటి వనరుల పరంగా రాష్ట్రం మరింత సమృద్ధిగా తయారవడం తథ్యంగా కనిపిస్తోంది.