‘గ్రాండ్ ఓల్డ్ లేడీ’ జనం షికారుకు సిద్ధం అవుతుందా?
ఐఎన్ఎస్ విరాట్ పేరు గుర్తుందా? ఈ ఏడాది జులై 23న యుద్ధ సేవల నుంచి విరమింపబడిన అత్యద్భుతమైన యుద్ధ నౌక. అదే ఐఎన్ఎస్ విరాట్ కు ఉన్న ముద్దు పేరే గ్రాండ్ ఓల్డ్ లేడీ. అయితే ఈ ఐఎన్ఎస్ విరాట్ను పర్యాటక ఆకర్షణ గల అద్భుత ప్రదేశంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు చంద్రబాబునాయుడు, నేవీ అడ్మిరల్ చీఫ్ బిస్త్ తో చర్చలు కూడా ఒక దశ పూర్తి చేసేశారు.
ఐఎన్ఎస్ విరాట్ అంటే.. భారత నౌకాదళంలో చాలా కీలకమైన నౌకల్లో ఒకటి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య రావడానికి ముందు.. నౌకాదళంలోనే ఇదే ప్రధానమైన నౌకగా ఉండేది.. ఎయిర్ క్రాఫ్ట కారియర్ గా కూడా సేవలందించింది. ఇది సుమారుగా 27 సంవత్సరాల పాటు నౌకాదళానికి సేవలందించింది. దీనిని సర్వీసునుంచి ఈ ఏడాది జులైలో ఉపసంహరించారు.
విశాఖపట్టణం నౌకాదళం ఆధీనంలో ఉన్న ఐఎన్ఎస్ విరాట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక రంగానికి తీసుకుని, విశాఖకే వన్నెతెచ్చే ప్రఖ్యాత పర్యటక అంశంగా మార్పు చేయాలనే ఆలోచన చంద్రబాబునాయుడుకు వచ్చింది. ఈ మేరకు ఆయన నౌకాదళానికి, ఆ రూపేణా కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త యాజమాన్యంలో ఒక కంపెనీని ఏర్పాటుచేసి దానిని ఏపీ టూరిజం శాఖకు అప్పగించి.. టూరిజం ఎట్రాక్షన్ గా సముద్రజలాల్లోనే ఉంచి నిర్వహించాలనేది ప్రతిపాదన.
దీనిని సైనిక సేవలనుంచి విరమించిన నాటినుంచి ఈ ప్రతిపాదన ఉన్నదిగానీ.. ఇప్పుడే రెండో దశకు వెళ్లింది. నేవీ చీఫ్ బిస్త్ సోమవారం నాడు చంద్రబాబునాయుడుతో ఈ విషయమై భేటీ అయ్యారు. ఇరు ప్రభుత్వాల సంయుక్త యాజమాన్యంలో చేయాలనే ప్రతిపాదన చంద్రబాబు వివరించారు. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిని కూడా కేటాయిసాతం అన్నారు. నిజానికి కేంద్రం వద్ద గానీ, నౌకాదళం వద్ద గానీ.. ఆ నౌకను ముక్కలు చేసేయడం తప్ప.. చంద్రబాబు ప్రతిపాదించిన దానికంటె గొప్ప ఆలోచన మరోటి ఏమీ లేనే లేదు. ఆ నేపథ్యంలో ఇది కార్యరూపం దాలిస్తే.. కేవలం ఐఎన్ఎస్ విరాట్ ను చూడడానికి విశాఖకు పర్యటకులు వచ్చే పరిస్థితి వస్తుందని అనుకోవచ్చు.