కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికతో టీడీపీ సాధించిందేంటి..!

కర్నూలు ఎమ్మెల్సీ ఏకగ్రీవం కావడంతో టీడీపీ నేతల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. కార్యకర్తలంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే ఇక్కడో వ్యక్తి వీరందరి కంటే రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. తాను టీడీపీ నేత కాకపోయినా.. టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం రాజకీయంగా తనకు ఎంతో లబ్ధి చేకూర్చిందని ఆనందపడుతున్నారు. ఇన్నాళ్లూ తానెక్కడున్నారో పట్టించుకోని నేతలు.. ఇప్పుడు తనతోనే మంతనాలు జరుపుతుండటంతో.. భవిష్యత్పై పూర్తి భరోసాతో ఉన్నారు ఆయన. తాను టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఈ ఎన్నిక బాగా ఉపయోగపడిందని భావిస్తున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే మళ్లీ సైకిల్ ఎక్కి దూసుకుపోవడం ఖాయమంటున్నారు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి!!
నచ్చిన పదవి దక్కుతుందా?
సుదీర్ఘ చర్చల అనంతరం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. తనకు నచ్చిన పదవులు పొందేందుకు, తన ప్రాధాన్యం పార్టీలో నిలబెట్టుకునేందుకు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలను వ్యూహాత్మకంగా వినియోగించుకున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. తన ప్రాధాన్యాన్ని అధిష్టానం గుర్తించేలా చేసుకోవడంలో ఆయన సఫలీకృతులయ్యారు. మొత్తంగా కర్నూలు ఎమ్మెల్సీ ఏకగ్రీవం కావడం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి బాగా ఉపయోగపడిందనే చర్చ మొదలైంది. కర్నూలు ఎమ్మెల్సీ రేసులో నిలబడిన వారందరి నామినేషన్లు ఉపసంహరించేలా చేయడంతో కేఈ కృష్ణమూర్తి సోదరుడు.. ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వైసీపీ ముందుగానే తప్పుకోవడంతో....
ఈ ఎన్నికల బరి నుంచి వైసీపీ ముందుగానే తప్పుకుంది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు, బీఎస్సీ నుంచి మరో అభ్యర్థి నామినేషన్ దాఖలైంది. ఫోర్జురీ అభియోగంతో బీఎస్సీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక, మిగిలిన అభ్యర్థులతో టీడీపీ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ముఖ్యమంత్రితో బైరెడ్డి భేటీ అనంతరం.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న బైరెడ్డి అనుచరుడు నాగిరెడ్డి కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. టీడీపీకి ఈ ఎన్నిక ఎంత మైలేజ్ పెంచుతుందో తెలీదుగానీ.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయ పునరాగమనానికి మాత్రం బాగా ఉపయోగపడిందట.
తనకు కావాల్సిన పదవులు....
టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత బైరెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించారు. ఆ మధ్య జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఆర్పీఎస్ తరఫున అభ్యర్థిగా భవనాశి పుల్లయ్యను బరిలోకి దించారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో దాదాపు ఐదేళ్ల తరువాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. వీరి మధ్య ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు, బైరెడ్డి టీడీపీలో చేరిక అంశం ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పార్టీలో తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనే అంశంపైనా చర్చ జరిగిందట. తన ప్రాధాన్యతను చాటుకుంటూ, టీడీపీలో తనకు దక్కాల్సిన స్థానాన్ని ముందుగానే చర్చించుకునేందుకు వీలుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికను వ్యూహాత్మకంగా వినియోగించుకున్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి!! వాస్తవంగా చూస్తే కర్నూలు జిల్లాలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు సైకిల్ ఎక్కించుకున్నారు. కాని గతంలో పార్టీలో ఉన్న బైరెడ్డిని మాత్రం లైట్ తీస్కొంటూ వచ్చారు. ఆయన తిరిగి టీడీపీలో చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవ్వరికి పట్టలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బైరెడ్డి తెలివైన ఎత్తుగడతో బాబుతో పాటు టీడీపీ వాళ్ల దృష్టి తన వైపునకు తిప్పుకునేలా చేసి సక్సెస్ అయ్యారు.
- Tags
- టీడీపీ

