కేంద్రం హాట్ కామెంట్.. బాబుకు అవమానమేనా?

కేంద్రం నుంచి ఏపీకి ఎన్నో నిధులు రావాలి. వాటితోపాటు అనేక ప్రాజెక్టులకు అనుమతులు కూడా రావాలి. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు! కానీ, వీటికన్నా ముందు.. కేంద్రం నుంచి అవమానాలు మాత్రం క్యూకట్టుకుని మాత్రం వచ్చి చేరుతున్నాయి. అది కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని పొగిడేస్తూ!! ఇంతకీ విషయంలోకి వెళ్తే.. చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఆయన ఎన్నో కోట్లు ఖర్చు చేసిన మరీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. దేశంలో దీనిని మించిన ప్రాజెక్టు లేదని, ఇది పూర్తయితే.. ఏపీ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అయిపోతుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పడాల్సిన కష్టం కన్నా ఎక్కువగానే పడుతున్నారు.
నిధుల విషయంలో....
కేంద్రం నుంచి నిధుల విషయంలోనూ ఆయన పోరాడుతున్నారు. కాంట్రాక్టర్ను మార్చే విషయంలో కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నారు. అలా ఈ పోలవరాన్ని దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలిపేందుకు పాటు పడుతున్నారు. మరి చంద్రబాబు ఇంతలా ఇన్ని ఆశలు పెట్టుకున్న ఈ పోలవరం ప్రాజెక్టును ప్రమోట్ చేయడంలో కేంద్రం చేస్తున్నది ఏపాటో అందరికీ తెలిసిందే. ఆర్థిక సాయం మాట అటుంచి.. అడుగడుగునా కొర్రీలు పెడుతోంది. ఇక, ఇప్పుడు తాజాగా అసలు పోలవరం ప్రాజెక్టుకు ఎసరు పెట్టేలా.. సీడబ్ల్యుసీ(కేంద్రం జలవనరుల సంఘం) చీఫ్ ఇంజినీర్ సీకేఎల్ దాస్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ప్రాజెక్టు ఒక అద్భుతమని, దేశ చరిత్రలోనే విభిన్నమైనదని కొనియాడారు.
కాళేశ్వరవం అద్భుతమంటూ...
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని పేర్కొన్న ఆయన ప్రాజెక్టు నిర్మాణం, ప్రణాళిక, పనులవేగం, పనులు జరుగుతున్న తీరు తమను ఆకట్టుకున్నాయని చెప్పారు. కాళేశ్వరానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. నేను రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నో ప్రాజెక్టులను పరిశీలించాను. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వాటన్నింటికంటే భిన్నమైంది. విశిష్టమైనది. స్ట్రక్చర్ల నిర్మాణ పరంగా, విజన్పరంగా, దీనిద్వారా కలిగే ప్రయోజనాలు, పనులు జరుగుతున్న తీరు.. ఇప్పటివరకునేనైతే ఎక్కడా ఇంత అద్భుతమైన పనితీరును గమనించలేదు అన్నారు. ఈ పరిణామం ఒక్కసారిగా ఏపీని ఉలిక్కి పడేలా చేసింది. ఒకపక్క చంద్రబాబు పోలవరం అద్భుతమని ప్రకటనలు గుపిస్తుండగా.. కేంద్రం పంపిన దూతలు మాత్రం తెలంగాణలో కాళేశ్వరాన్ని మించిన ప్రాజెక్టు ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేదని ముక్తాయిస్తున్నారు.
పొగడ్తల వెనక...?
వాస్తవానికి ఏపీ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. దీంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, దీనికి వ్యతిరేకంగా కేంద్రం తెలంగాణ ప్రభుత్వంతో మిత్రత్వం లేకపోయినా.. ఇప్పుడు దాంతో సఖ్యత పెంచుకోవాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టను పొగడ్తలతో ముంచెత్తడం. మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు చెబుతున్నట్టు పోలవరం ప్రాజెక్టు అద్భుతం కాదు.. కాళేశ్వరమే అద్భుత కట్టడమనేలా కేంద్రం నుంచి వచ్చిన వారు చెబుతుండడాన్ని బట్టి.. ఏపీసీఎం చంద్రబాబు ప్రకటనలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. మరి దీనిని ఆయన ఎలా ఖండిస్తారో? చూడాలి. వాస్తవానికి గత నెలలో పోలవరంపై మాట్టాడిన కేంద్ర మంత్రి గడ్కరీ.. దీనిని బహు విధాల ప్రస్తుతించారు. మరి ఇంతలోనే ప్లేటు మార్చడం వెనుక ఏముందో తెలియాలంటే.. కొంత టైం పడుతుందేమో చూడాలి!

