కాంట్రాస్ట్ : రాజకీయ విమర్శలు.. నిపుణుల ప్రశంసలు...
మోదీ సర్కారు ఒక నిర్ణయం తీసుకుంటే.. దాని మంచి చెడుల విషయంలో దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మోదీ హఠాత్తుగా రాత్రి 8.30 గంటలకు నిషేధం విధించే ప్రకటన చేసి, అర్థరాత్రి నుంచి ఆ నిషేధాన్ని అమల్లోకి తేవడం వల్ల సామాన్యులకు కూడా చాలా ఇబ్బుందులు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఒక రకంగా చెప్పాలంటే.. మోదీ ఇలాంటి నిర్ణయాన్ని ఏదో మంచి కోసమే తీసుకున్నారనే అభిప్రాయంతో సామాన్యులు కూడా అర్థం చేసుకుని సహకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నిర్ణయంమీద తమ అభిప్రాయాలు వెల్లడించగలిగిన స్థాయిలోని సెలబ్రిటీల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అన్నిటికంటె ప్రధానంగా.. ఒక కీలకమైన పరస్పర విరుద్ధమైన వైఖరులు ప్రముఖుల అభిప్రాయాల్లో వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా విపక్షాలకు చెందిన వారందరూ కూడా మోదీ నిర్ణయాన్ని తూర్పారపడుతున్నారు. ఇది లోపభూయిష్టమని, ఇలాంటి గిమ్మిక్కుల వలన ప్రయోజనం ఉండదని అంటున్నారు. అదే సమయంలో బ్యాంకింగ్, ఆర్థిక, వ్యాపార రంగాలకు చెందిన నిపుణులు మాత్రం ఈ నిర్ణయాన్ని సర్వత్రా హర్షిస్తున్నారు. ఈ కాంట్రాస్ట్ చాలా చిత్రంగా కనిపిస్తోంది.
ప్రధానంగా ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. నోట్ల రద్దు వలన లాభం కంటె నష్టమే ఎక్కువ జరుగుతుందని కాంగ్రెస్ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడించారు. దీనివల్ల నల్ల ధనం నియంత్రణ సాధ్యం కాదని ఆయన అంటున్నారు. 2000 రూపాయల నోట్లు తీసుకువచ్చిన తరువాత.. ఇక నల్లధనాన్ని ఎలా కట్టడి చేయగలరో చెప్పాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం, బ్యాంకులకు ఇదొక అగ్ని పరీక్ష అని చిదంబరం వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ కూడా ఈ నోట్ల రద్దు సరైన నిర్ణయం కాదని విమర్శిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు వలన సామాన్యులు మాత్రమే ఇబ్బందులు పడుతున్నారని, బడాబాబులకు ఎలాంటి ఇబ్బంది లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే మోదీ నల్లధనం కట్టడి చేస్తానని ప్రకటనలు చేసినప్పుడు, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెస్తారని భావించామని, ఆ దిశగా ఏమీ చేతకాక ప్రజల దృష్టి మళ్లించడానికి ఇప్పుడు ఇలాంటి నోట్ల రద్దు వంటి గిమ్మిక్కులకు పాల్పడుతున్నారని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. నోట్ల రద్దు వలన ప్రయోజనం ఏమీ లేదని, సామాన్యులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఇదే విమర్శలను రీట్వీట్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఈ రకంగా చూసినప్పుడు రాజకీయంగా విపక్షాలకు చెందిన వారు మాత్రం ఇలా విమర్శలు చేస్తున్నారు. సహజంగానే భాజపా కు చెందిన ముఖ్యమంత్రులు, ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన వారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
ఇక ఆర్థిక రంగ నిపుణుల విషయానికి వస్తే.. ముక్తకంఠంతో నిపుణులందరినుంచి ఒకటే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి చాలా దోహదం చేస్తుందని వారంతా వ్యాఖ్యలు చేస్తున్నారు. వివిధ బ్యాంకుల ఛైర్మన్ లు, ఆర్థిక రంగ నిపుణులు, వ్యాపార సంస్థల ఉన్నతోద్యోగులు అంతా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు , ఆర్థిక నిపుణులకు అభిప్రాయాల మధ్య ఇంతటి వైరుధ్యం ఉండడమే విచిత్రమైన సంగతి.