ఏపీలో స్వదేశీ రంగం : ‘పంచ’ పతంజలి పరిశ్రమలు
విదేశాలనుంచి విదేశీ పెట్టుబడిదార్లనుంచి కొత్త పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకురావడానికి ఒకవైపు ముమ్మరంగా పర్యటనలతో చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూ ఉండగా.. స్వదేశీ ఉత్పత్తులే తొలుత తమ పరిశ్రమలను, ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటుచేసేలా వాతావరణం కనిపిస్తోంది. స్వదేశీ మార్కు ఉన్న ఉత్పత్తులతో దేశీయ వినియోగ మార్కెట్ ను కుదిపేస్తున్న పతంజలి సంస్థ దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా ఏపీలో తమ ఉత్పాదక పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తోంది. రాష్ట్రంలో
మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు దేశీయ ఉత్పత్తుల అగ్రగామి సంస్థ పతంజలి గ్రూపు సంసిద్ధత వ్యక్తం చేసింది.
సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయిన పతంజలి గ్రూప్ సహ వ్యవస్థాపకులు ఆచార్య బాలకృష్ణజీ తమ ప్రతిపాదనలను వివరించారు.ఆంధ్రప్రదేశ్లో మెగా ఫుడ్ పార్కు, ఆవుల సంతతి పరిరక్షణ కేంద్రం, ఆయుర్వేద విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పతంజలి గ్రూప్ సిద్దంగా ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి విశాఖ, విజయనగరం ప్రాంతాలలో ఇప్పటికే స్థల పరిశీలన చేసినట్టు చెప్పారు.
పతంజలి గ్రూపు ఏపీలో ప్రధానంగా 5 ప్రాజెక్టుల ఏర్పాటుకు సన్నధ్దమవుతోంది. అందులో రెండు తిరుమల తిరుపతి దేవస్థానం భాగస్వామ్యంతో ఏర్పాటుచేస్తారు. గోశాల నిర్వహణతో పాటు గో సంతతి అభివృద్ధి కేంద్రం, అలాగే, టీటీడీ ఆయుర్వేద కళాశాల అభివృద్ధితో పాటు ఆయుర్వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రాజెక్టులు టీటీడీ సహాయంతో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఉత్తరాంధ్రలో మెగాపుడ్ పార్కు ఏర్పాటు చేయడానికి పతంజలి గ్రూప్ ప్రతినిధులు ఆసక్తిగా వున్నారు. బిస్కట్లు వంటి ఆహార పదార్ధాల ఉత్పత్తి, సబ్బులు, షాంపులు సౌందర్య పోషక ఉత్పత్తులు, ఇతర ప్రకృతి సిద్ధ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటుతో పాటు యోగ, నేచురోపతి సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ 5 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టనున్నారు.
పతంజలి వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ముందుకు రావడం ఎంతో సంతోషదాయకం అన్న ముఖ్యమంత్రి, పరిశ్రమ స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.