ఏపీలో ఇక హెలికాప్టర్ విహారాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెలి టూరిజం ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం సోమవారం నాడు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో మూడు ప్రధాన పట్టణాల మధ్య హెలికాప్టర్ లు ఆపరేట్ చేసేందుకు సమ్మిట్ ఏవియేషన్ సంస్థకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చేసింది. ఈ మేరకు విజయవాడ, తిరుపతి, శ్రీశైలం మధ్య హెలిటూరిజం ను ప్రాథమికంగా నడుపుతారు. ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది అనే దాన్ని బట్టి రాష్ట్రంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించే ప్రయత్నం చేస్తారు.
హెలిటూరిజం అనేది రకరకాల మార్గాల్లో ఇదివరకే అమల్లో ఉంది. గతంలో తిరుపతి వంటి పట్టణాలను మాత్రం విహంగ వీక్షణం చూడడానికి హెలికాప్టర్ లో పర్యటకుల్ని తిప్పి చూపించే పద్ధతిలో హెలి టూరిజం ను పెట్టారు. అయితే కాలక్రమంలో ఇది అంతగా సక్సెస్ కాలేదు. అదే సమయంలో తెలంగాణలో హైదరాబాదునుంచి శ్రీశైలం వరకు హెలికాప్టర్ ద్వారా భక్తులను తీసుకువెళ్లేలా హెలి టూరిజం ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ... ఇది కూడా ఎక్కువ కాలం నడవలేదు. ఇప్పుడు తాజాగా ఏపీలో మూడు నగరాల మధ్య ఈ ప్రాజెక్టును చంద్రబాబు సంకల్పిస్తున్నారు.
విజయవాడలో రెండు , తిరుపతిలో ఒకటి హెలిపాడ్ లను ఈ టూరిజం కోసం ప్రత్యేకంగా తక్షణం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను కూడా ఆదేశించింది. అలాగే శ్రీశైలం సమీపం సున్నిపెంట వద్ద హెలిపాడ్ ఏర్పాటుకు స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. అయితే ఏపీలో ఈ హెలి టూరిజం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.