ఏపీ వారి రగడ కూడా హీటెక్కింది!
విపక్షాల్లోని ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఫిరాయించి అధికార పార్టీలో చేరితే.. వారిమీద ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడాలి కదా! కానీ అలా జరగకపోవడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్రమైన చర్చనీయాంశం కింద నడుస్తూనే ఉంది. న్యాయపరమైన వివాదంగా కూడా నడుస్తోంది. తెలంగాణకు సంబంధించి ఫిరాయించిన ఎమ్మెల్యేల వివాదం, ఇప్పటికే సుప్రీంకోర్టు వరకు వెళ్లి రాజ్యంగా ధర్మాసనానికి నివేదింపబడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి చేరిన వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో విచారణకు వచ్చింది. వైకాపా నుంచి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నేరుగా నోటీసులు ఇచ్చింది. విచారణను మరో నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత విపక్షాల నుంచి విచ్చలవిడిగా అధికార పార్టీల్లోకి ఫిరాయింపులు జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ కేసీఆర్ ఈ ఆకర్ష పర్వానికి తెరతీసిన చాలాకాలానికి , చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వ పరిపాలనను చూసి.. విపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి ఆసక్తిగా వస్తున్నారని అంటూ.. అదే పనిచేశారు. 20 మంది వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వీరి మీద ఆలస్యం లేకుండా వైకాపా నాయకులు అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకరు కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. అయితే స్పీకరు తరఫునుంచి మాత్రం స్పందన శూన్యం.
ఇలాంటి నేపథ్యంలో.. వైకాపాకు చెందిన ఉరవకొండ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గురించి హైకోర్టులో వేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. న్యాయస్థానం మొత్తం 20 మంది వైకాపా ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. ఉరవకొండ ఎమ్మెల్యే వేసిన పిటిషన్లో తెలుగుదేశం పార్టీని, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఎన్నికల కమిషన్ ను కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఈనేపథ్యంలో నాలుగు వారాల తర్వాత.. హైకోర్టులో ఏపీ ఫిరాయింపుల మీద ఎలాంటి చర్చ జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లి.. సుప్రీం ఆదేశాలను తెలంగాణ స్పీకరు ఖాతరు చేయకపోయిన నేపథ్యంలో ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదింపబడి ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి తెలంగాణ ఫిరాయింపుల వ్యవహారంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇస్తే గనుక.. అదే మిగిలిన వారికి ప్రమాణికంగా మారే అవకాశం ఉంది. మరి ఈలోగా ఏపీ ఫిరాయింపుల విచారణ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.