ఏచూరి ప్రస్తావించిన అంశాల్ని పట్టించుకోవాలి
దేశమంతా ఒక్కటే అంశం మీద జనం ఆలోచనలు సాగుతున్నప్పుడు, అదే సమయంలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మరో రకం విషయాల చర్చ జరుగుతుందని అనుకోవడం భ్రమ. పైగా ప్రతిపక్షాలు నోట్ల రద్దు వ్యవహారాన్ని పెద్ద రాద్ధాంతంగా మార్చాలని అనుకుంటే వారికి అంత అవకాశం లేకుండా.. ప్రధాని మోదీ చక్కగా చర్చకు సిద్ధమే అంటూ ప్రకటించారు. ప్రధానంగా రాజ్యసభలో తొలిరోజు మొత్తం నోట్ల రద్దు- తత్సంబంధిత ప్రజల కష్టాల గురించే చర్చ జరిగింది. అయితే ఈ చర్చలోనూ విపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు పనిగట్టుకుని, సర్కారు మీద బురద చల్లడమే ధ్యేయంగా మాట్లాడారు. పాలకపక్షం వారు చెప్పినట్లుగా తాత్కాలికంగా ఎదురవుతున్న సమస్యలను పెద్దవి చేసి చూపించి, రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నించారు. కొందరు మాత్రం వాస్తవంగా ప్రజలకు ఎదురవుతున్న అసలు ఇబ్బందులను, ప్రభుత్వం దాచిపెడుతున్న విషయాలను కూడా ప్రస్తావించారు. అలాంటి వాటిలో సీపీఎం నాయకుడు సీతారాం యేచూరి ప్రస్తావించిన రైతు సమస్యలన్నీ వాస్తవంగా చాలా సీరియస్ అంశాలు. మీడియా దృష్టి కూడా పడని కీలక అంశాలను, రైతుల ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. నిజం చెప్పాలంటే విపక్ష సభ్యులనే ధోరణితో కాకుండా... ఆయన ప్రస్తావించిన ఇబ్బందుల్ని పట్టించుకోవడం మోదీ సర్కారుకే మంచి పేరు తెస్తుంది.
యేచూరి చెప్పిన మాటల్లో .. ప్రధానంగా 2000 రూపాయల నోట్లు ఉండడం వల్ల.. నల్లధనం మరింత పెరుగుతుందనేది అందరూ చెబుతున్న మాటే అయితే.. ఈ నిర్ణయంతో వ్యవసాయ రంగం అనూహ్యంగా కుదేలైందని ఆయన సాధికారికంగా వివరించారు. ఈ నిర్ణయం వల్ల సేద్యపు ఉత్పత్తుల రవాణా స్తంభిస్తోందని, ట్రక్కులు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయని, పంటల ధరలు పడిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అంశాలే.
అలాగే ఆన్ లైన్ వ్యవహారాలు నడవాలని ప్రభుత్వం అంటుండగా.. ఈ దేశంలో ఆన్ లైన్ ఎందరికి అలవాటు, అందుబాటు ఉన్నదో పరిశీలించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని, అలాగే.. ఆన్ లైన్ లావాదేవీల మీద రుసుములు కూడా రద్దు చేయాలని యేచూరి కోరుతున్నారు. మరి విపక్షనేత చేసిన ఈ విలువైన సూచనలను మోదీ సర్కారు పట్టించుకుంటుందో లేదో చూడాలి.