ఆపరేషన్ బ్లాక్మనీ : పరిణామాలు ఎలా ఉన్నాయంటే...
బ్లాక్ మనీ ని అడ్డుకోవడం అనే ప్రధాన లక్ష్యంతో మోదీ సర్కారు 500, 1000 నోట్లను ఒక్కసారిగా నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల.. ఊహించినట్లే జనజీవనం అతలాకుతలం అవుతోంది. సామాన్య ప్రజలకు కూడా ఈ నిర్ణయం వల్ల కొన్ని రోజులు ఇబ్బందులు ఉంటాయని అయితే అందరూ అర్థంచేసుకుని సహకరించాలని మోదీ ముందుగానే ఒక విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. అర్థంచేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా.. ప్రాక్టికల్గా చాలా చోట్ల చాలా రకాలుగా ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి.
- 11వ తేదీ వరకు పెట్రోలు బంకుల్లో నోట్లు మార్చుకోవచ్చు అని మోదీ చెప్పారు. అయితే పెట్రోలు బంకుల్లో చిల్లర సమస్య ఎదురవుతోంది. 500 నోటు ఇస్తే అంత మొత్తానికీ పెట్రోలు కొట్టడానికి చూస్తున్నారు తప్ప.. చిల్లర ఇవ్వడానికి బంకుల్లో ఉండడం లేదు.
- ఆర్టీసీ బస్సుల్లో కూడా చిల్లర సమస్య ఎదురవుతోంది. ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు.
- క్యాంటీన్లు వంటి చోట్ల కూడా చిల్లర ఉంటే తప్ప టిఫిన్లు భోజనాలు కూడా చేయవద్దంటూ యాజమాన్యాలు ముందే చెప్పేస్తున్నాయి. 500 నోట్లను ఎవ్వరూ తీసుకోవడం లేదు.
- టోల్ గేట్ల వద్ద చాలా పెద్ద సమస్య వచ్చింది. దాదాపుగా ప్రతి టోల్ గేటు వద్ద కూడా చిల్లర సమస్యలు ఉత్పన్నమై.. కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోవడంతో.. కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశవ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు టోల్ ట్యాక్స్ లను రద్దు చేసేసింది.
- బ్యాంకులకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
- 11వ తేదీ ఒక్కరోజునే నగదును మార్చుకోవడానికి అవకాశం ఉండేలా కనిపిస్తోంది. 12వ తేదీ శనివారం, 13 ఆదివారం, 14 గురునానక్ జయంతి సందర్భంగా సెలవు కావడంతో.. బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. పెద్దనోట్లు మార్చుకోవడానికి ప్రజలకు ఇంకా ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది.
- ఆటో డ్రయివర్లు, క్యాబ్ సర్వీసులు ఇలాంటి వారికి 500 నోట్లు తీసుకోలేక, చిల్లర సదుపాయం లేక, కస్టమర్ల వద్ద చిల్లర లేక చాలా ఇబ్బందిగా ఉంది.
- చాలా పెట్రోలు బంకులు చిల్లర సమస్యను తట్టుకోలేక మూత వేసేశారు. జనం మొత్తం తమ నోట్లు మార్చుకోవడానికి పెట్రోలు బంకుల వద్దకే వెల్లువలా వస్తుండడంతో ఈ పరిస్థితి తప్పలేదు.
- అందరూ బ్యాంక్ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ మీదనే ఆదారపడుతూ ఉండడంతో.. పలు బ్యాంకుల ఇంటర్నెట్ వెబ్ సైట్ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఆన్ లైన్ కార్యకలాపాలు కూడా స్తంభిస్తున్నాయి. ప్రస్తుతానికి అందరికీ ఇది తప్ప మరో గత్యంతరం లేకపోవడంతో... ఆన్ లైన్ మీదనే ఆధారపడుతున్నారు. దీంతో అందరికీ ఇబ్బందులు తప్పడం లేదు.