అమ్మ పరోక్షంలోనే : యువరాజుకు విజ్ఞప్తి, తిరస్కృతి!!
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి .. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ముక్తకంఠంతో యువరాజ పట్టాభిషేకానికే నిశ్చియించారు. తమరు ఇక సారథ్యం చేపట్టాల్సిందే అంటూ యువరాజుకు విజ్ఞప్తి చేశారు. అయితే యువరాజు మాత్రం ససేమిరా అన్నారు. తెరవెనుక సాంతం తన కనుసన్నల్లోనే నడిపించడానికి ఇష్టపడినా.. తెరమీదకు బాధ్యతలు తీసుకోవడానికి ఇప్పటిదాకా సుముఖుత చూపించని రాహుల్ గాంధీ మరో మారు సీడబ్ల్యూసీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. దాంతో గత్యంతరం లేని స్థితిలో సోనియాను మరో ఏడాది పాటూ వర్కింగ్ కమిటీకి అధ్యక్షురాలిగా అందరూ కలిసి ఎన్నుకున్నారు.
ఈ హైడ్రామా సోమవారం నాడు వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా చోటు చేసుకుంది. ఈ సమావేశానికి అనారోగ్యం కారణంగా సోనియా గైర్హాజరైన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ సారథ్యంలోనే ఎన్నికల మరియు పార్లమెంటు శీతాకాల సమావేశాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోనియా స్థానంలో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాల్సిందిగా సభ్యలందరూ కోరినప్పటికీ.. రాహుల్ గాంధీ తిరస్కరించినట్లుగా తెలుస్తోంది.
2014 ఎన్నికల తర్వాత ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకున్న ఎన్నికలు ఏవీ లేవు. అలాంటి నేపథ్యంలో ఎక్కడో ఒక చోట తన సత్తా నిరూపించుకున్న తర్వాత పార్టీ పగ్గాలు తీసుకుంటే గౌరవంగా ఉంటుందని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. ప్రస్తుతం జరగనున్న యూపీ, పంజాబ్ తదితర రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన ఆశ తీరుతుందా లేదా అనేదే ప్రశ్న!