అమరావతిలో టిడిపి ఆఫీస్ కి వెళితే ...!

కార్యకర్తలకు కడుపు నిండుతుంది. పుణ్యం పురుషార్థం దక్కుతుందని భావించిన టిడిపి నిత్యాన్నదాన కార్యక్రమం చేయాలని తలపెట్టింది. అమరావతి కేంద్రంగా నూతనంగా ఏర్పాటు కాబోతున్న టిడిపి జాతీయ కేంద్ర కార్యాలయంలో నిత్యాన్నదాన సత్రం ఏర్పడబోతోంది. తిరుమల లో నిత్యాన్నదాన క్రార్యక్రమాలు ఏ తరహాలో వెంగమాంబ సత్రంలో జరుగుతాయో అదేవిధంగా పార్టీ కార్యాలయం భక్తులకు బదులు కార్యకర్తల ఆకలి తీర్చే కేంద్రం అయిపోతుంది. నూతన కార్యాలయ భవన శంఖుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదానం కోసం పెద్దఎత్తున విరాళాల సేకరణ మొదలెట్టేశారు. మూడున్నర ఎకరాల సువిశాల స్థలంలో నిర్మిస్తున్న ఈ అత్యాధునిక భవనంలో ఒక బ్లాక్ లో నిత్యాన్నదానం కొనసాగేలా ఏర్పాట్లు చేయనున్నారు.
దేశంలోనే తొలి ప్రయోగం ...
పార్టీ కేంద్ర కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే వారికోసం ఇలా ఉచిత అన్నదానం చేస్తున్న పార్టీలు దేశంలో ఇప్పటివరకు ఏవి లేవు. ఈ సరికొత్త కాన్సెప్ట్ సుదూర ప్రాంతాలనుంచి వచ్చే పార్టీ కార్యకర్తలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. పార్టీ పట్ల వారి నిబద్ధత క్రమశిక్షణ మరింతగా పెరిగేలా దోహదం చేస్తుందని టిడిపి వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రొపోజల్ ను పార్టీ పెద్దలు పెట్టిన వెంటనే చంద్రబాబు ఆమోద ముద్ర వేసారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పధకం పకడ్బందీగా అమలు కావాలంటే ఇప్పటినుంచి భారీ ఎత్తున విరాళాలు సేకరించే పనికి అధినేత శ్రీకారం చుట్టేశారు. ఆ సొమ్ము ను శాశ్విత నిధి గా ఏర్పాటు చేసి తద్వారా అన్నదాన కార్యక్రమం ఎట్టిపరిస్థితుల్లో ఆగకుండా కొనసాగించాలన్న టిడిపి సంకల్పాన్ని కార్యకర్తలు స్వాగతిస్తున్నారు.
- Tags
- టీడీపీ

