‘అది అమ్మ లేఖ’ అనగానే ఆనందోత్సహాలు!
వ్యక్తి ఆరాధనకు తమిళనాడు వాసులు పెట్టింది పేరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జయలలిత తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాతావరణం మాత్రమే కాదు, ప్రతిపక్ష నేత కరుణానిధికి ఆ పరిస్థితి వచ్చినా.. ఆయనను ఆరాధించే వర్గాలనుంచి ప్రతిస్పందన ఇదే తరహాలో ఉంటుందనడం ఖరారు. అలాంటి వ్యక్తి ఆరాధనకు పెద్దపీట వేసే పురట్చి తలైవి జయలలిత భక్తుల్లో ఇప్పుడు ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పండుగ వాతావరణం నెలకొంది. జయలలిత రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ, తాను పూర్తిగా కోలుకున్నానంటూ సమాచారాన్ని తీసుకురావడమే వారి ఆనందానికి కారణంగా ఉంది.
జయలలిత సెప్టెంబరు 22వ తేదీనుంచి అపోలో ఆస్పత్రిలోనే ఉన్నారు. మధ్యలో ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా మారిన మాట కూడా నిజం. విదేశీ వైద్యులు కూడా వచ్చి సేవలందించారు. నిజానికి వివిధ రాష్ట్రాల మరియు కేంద్రప్రభుత్వ ప్రముఖులు అనేకమంది పరామర్శలకు వచ్చారు గానీ.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి చూసి మాట్లాడిన వారు లేరు. అందరూ ఆస్పత్రిలోనికెళ్లి డాక్టర్లతో మాట్లాడి తిరిగి వెళ్లిపోయిన వారే. అంత గుంభనంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని ఉంచారు.
కొన్ని వారాల పాటు హెల్త్ బులెటిన్ కూడా ఇవ్వకుండా ఒకవైపు అభిమానుల్ని అపోలో ఆస్పత్రి టెన్షన్ పెట్టింది. రెండు రోజుల కిందట అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ జయలలిత పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు. అక్కడితో అభిమానులకు ప్రాణం లేచి వచ్చినట్లయింది.
తాజాగా జయలలిత రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ.. మీ పూజల వల్లే నాకు పునర్జన్మ లభించింది.. అంటూ అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ విడుదల అయింది. నిజానికి జయలలిత ఆరోగ్యాన్ని ధ్రువీకరించే ఫోటో గానీ, వీడియో గానీ విడుదల కాలేదు. ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. అయితే ఆమె రాసిన లేఖ అనగానే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. జయలలిత మరి కొన్ని రోజుల వ్యవధిలోనే అపోలో ఆస్ప్రతి నుంచి తన ఇంటికి వెళ్తారని మాత్రం తెలుస్తున్నది.