వైసీపీ చెప్పినట్లే చేసినా....?

వైసీపీ డిమాండ్ చేసినట్లుగానే అన్నీ చేసినా తనతో కలసి రావడం లేదని, వైసీపీ లాలూచీ రాజకీయాలకు పాల్పడుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. సాధికారమిత్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము కేంద్ర ప్రభుత్వంలో ఉంటే మంత్రులు రాజీనామాలు చేయాలని వైసీపీ డిమాండ్ చేసిందన్నారు. అలాగే మంత్రుల చేత రాజీనామా చేయించామన్నారు. తర్వాత ఎన్డీఏలో ఇంకా ఎందుకు ఉన్నారని వైసీపీ నేతలు ప్రశ్నించారన్నారు. తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామన్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పట్టరని వైసీపీ ప్రశ్నించిందన్నారు. అవిశ్వాసమూ పెట్టామన్నారు. కాని ఇప్పుడు తాను ముఖ్యమంత్రి హోదాలో ప్రక హోదా కోసం పోరాడుతుంటే మాత్రం వైసీపీ కలసి రావడం లేదన్నారు. తాను ముఖ్యమంత్రిగా దీక్ష చేస్తే కనీసం సంఘీభావం కూడా తెలపలేదన్నారు. తాను బయటకు వెళ్లిపోతే చిన్నా చితకా పార్టీలతో కలసి వెళ్లవచ్చని బీజేపీ భావిస్తుందన్నారు. దీక్ష తర్వాత తన పోరాటం ప్రత్యేక హోదాపై ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన జరిగే తిరుపతి సభలో మోడీని నిలదీయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలకు గ్రామస్థాయిలో వివరించాలని చంద్రబాబు సాధికార మిత్ర సభ్యులను కోరారు.
