Thu Apr 02 2026 19:02:03 GMT+0530 (India Standard Time)
రోజాకు జగన్ ఉగాది కానుక
ఆర్కే రోజా కు జగన్ ఎన్నికలకు ముందు వరం ప్రకటించారు. ఆమె డిమాండ్లను అంగీకరించారు

ఆర్కే రోజా కు జగన్ ఎన్నికలకు ముందు వరం ప్రకటించారు. ఆమె డిమాండ్లను అంగీకరించారు. నగరి నియోజకవర్గంలో రోజా ఇమేజ్ ను మరింత పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. నగిరిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారు. అలాగే పుత్తూరు, వడమాల పేట మండలాలను తిరుపతి జిల్లాలో కలపడంతో ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రోజా కొన్ని అభ్యంతరాలను లేవనెత్తారు.
రెవెన్యూ డివిజన్....
తమ నగరి నియోజకవర్గం తిరుపతి పట్టణానికి అత్యంత దగ్గరలో ఉంటుందని, జాతీయ రహదారిని ఆనుకుని ఉంటుందని రోజా తెలిపారు. నగరిని చిత్తూరు జిల్లాలో కలపవద్దంటూ చీఫ్ సెక్రటరీకి కూడా రోజా వినతి పత్రాన్ని అందించారు. ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లేలా చూడగలిగారు. దీంతో నగరికి రెవెన్యూ డివిజన్ ను, తిరుపతి జిల్లాలో రెండు మండలాలను కలుపుతూ కొత్త నోటిఫికేషన్ లో చోటు కల్పించారు.
జగన్ పై పొగడ్తలు....
దీంతో ఎమ్మెల్యే ఆర్కే రోజా జగన్ పై ప్రశంసలు కురిపించారు. తమ నగరి నియోజకవర్గానికి సరిపడా వరాలు ఇచ్చారని రోజా పేర్కొన్నారు. నగరి ప్రజలు వందేళ్లు గుర్తుపెట్టుకునే విధంగా నిర్ణయం తీసుకున్నారని జగన్ ను రోజా పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు 14 ఏళ్లలో కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయలేదని, జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని రోజా ప్రశంసించారు.
Next Story

