Sun Mar 15 2026 11:56:02 GMT+0530 (India Standard Time)
సీటు మారిన ఆనం.. అందుకేనా?
వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ సభ్యుల పక్కన కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజు సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ సభ్యుల పక్కన కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ ప్రసంగం కావడంతో ఉభయ సభలకు చెందిన సభ్యులు ఉంటారు. అందువల్ల ఆయన మామూలుగానే అక్కడ కూర్చున్నారా? లేక కావాలని టీడీపీ సభ్యులతో కలసి కూర్చున్నారా? అన్న సంగతి శాసనసభలో హాట్ టాపిక్ గా మారింది.
అందుకేనా?
ఆనం రామనారాయణరెడ్డి గత కొంతకాలంగా అధికార వైసీపీని విభేదిస్తున్నారు. ప్రభుత్వం, పార్టీపై విమర్శలు చేయడంతో ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహించే వెంకటగిరి నియోజకవర్గానికి వైసీపీ అధినేత జగన్ సమన్వయ కర్తగా నేదురుమిల్లి రామ్కుమార్ రెడ్డిని నియమించారు. అప్పటి నుంచి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం మరింత ఊపందుకుంది.
త్వరలోనే పార్టీ మారతారన్న...
ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతారన్న ప్రచారానికి తోడుగానే పసుపు కండువాల పక్కనే ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. లేకుంటే ఉభయ సభలు సమావేశం కావడంతో సభ్యుల సంఖ్య ఎక్కువ కావడంతోనే అలా ఆనం అక్కడ కూర్చోవాల్సి వచ్చిందా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ప్రచారానికి తగ్గట్లుగానే ఆనం సీటు మారడం హాట్ టాపిక్ గా మారింది.
Next Story

