యతేంద్ర కల నెరవేరేనా ?
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వరుణ నియోజకవర్గంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఆయన గతంలో అనేక పర్యాయాలుగా గెలిస్తూ వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఆయన కచ్చితంగా గెలుస్తాడని ప్రత్యర్థి పార్టీలకు కూడా ఒక అంచనా. కానీ, ఇంత బలమైన నియోజకవర్గాన్ని ఆయన వదులుకున్నారు. తన కుమారుడు యతేంద్రను ఎమ్మెల్యేను చేయడం కోసం తన నియోజకవర్గాన్ని త్యాగం చేశారు. సిద్ధరామయ్యకు ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు మరణించారు. యతేంద్రకు మంత్రి కావాలనేది కల. కుమారుడి కలను నెరవేర్చేందుకు సిద్ధరామయ్య వరుణను కుమారుడికి వదిలి తనకు అంతగా పట్టులేని చాముండేశ్వరి, బాదామి నుంచి బరిలో నిలిచి ఒకచోట ఓడిపోగా, మరోచోట స్వల్ప తేడాతో గెలిచాడు. తండ్రి ఇంత త్యాగం చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో మంత్రి కావాలన్న యతేంద్ర కల నెరవేరడం డౌట్ గానే ఉంది. ఇక జేడీఎస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య మంత్రి పదవి తీసుకుని అవకాశం లేదు. దీంతో ఆయన కోటాలో కుమారుడికి పదవి ఇప్పించే అవకాశం ఉంది. ఏదేమైనా యతేంద్ర కల నెరవేరాలంటే జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ అధికారం చేపట్టడం మాత్రం తప్పనిసరి.