Sun Mar 15 2026 04:44:18 GMT+0530 (India Standard Time)
విష్ణు జంప్ కు టైం అయింది
విశాఖకు చెందిన విష్ణుకుమార్ రాజు బీజేపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అయిపోతున్నారు

ఆంధ్రప్రదేశ్ లో మరో బీజేపీ నేత పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే రాజీనామా చేయనున్నారని చెబుతున్నారు. విశాఖకు చెందిన విష్ణుకుమార్ రాజు బీజేపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అయిపోతున్నారు. ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాతో బీజేపీ కొంత ఇబ్బందుల్లో పడింది. అదే బాటలో మరికొందరు నేతలు పయనించేలా ఏర్పాటు చేసుకుంటున్నారు.
బహిరంగంగానే...
నిన్న విష్ణుకుమార్ రాజు మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసి చాలా సేపు మాట్లాడారు. ఆయనతో మంతనాలు జరిపారు. ఆయన బహిరంగంగానే ఏపీ బీజేపీపై విమర్శలు చేశారు. దీంతో ఆయన కూడా పార్టీ మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 2014లో బీజేపీ నుంచి విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు శాసనసభ పక్ష నేతగా కూడా కొనసాగారు.
టీడీపీ నుంచి...
తెలుగుదేశం పార్టీలో చేరితే తనకు టిక్కెట్ ఖాయమని నమ్ముతున్నారు. అక్కడ ప్రస్తుతం గెలిచిన గంటా శ్రీనివాసరావు నార్త్ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. ఆయన టీడీపీ నుంచి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు టీడీపీలో చేరి విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన వెంటనే ఆయన పార్టీ కండువాను మార్చేస్తారంటున్నారు. అందుకే బీజేపీపై బహిరంగంగా విమర్శలు చేశారన్నది వాస్తవం. ఆయన టీడీపీలో చేరడంతో విశాఖలో బీజేపీ మరింత బలహీనమవుతుందన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి.
Next Story

