Sat May 24 2025 12:17:34 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : గాలి దుమారం.. గరిష్ట ఉష్ణోగ్రతలు లేటెస్ట్ వెదర్ అప్ డేట్ ఇదే
రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడే పరిస్థితి కనిపించడం లేదు.

రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడే పరిస్థితి కనిపించడం లేదు. ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గాలి దుమారంతో పాటు భారీ వర్షాలు పడుతుండటంతో సాయంత్రానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అన్ని రకాలుగా నష్టపోయిన రైతులు బలమైన ఈదురుగాలులతో ఉన్న పంట కూడా పోతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రకృతికి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో తాము చూశామని రైతులు వాపోతున్నారు. గాలి వాన బీభత్సంతో చేతికొచ్చిన పంట అందకుండా పోతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు రేపు కూడా...
ఈరోజు, రేపు కూడా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని, మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని, పలు చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వేడిగాలుల తీవ్రత కూడా...
తెలంగాణాలోనూ ఈరోజు, రేపు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని కూడా హెచ్చరించింది. నలభై మూడు నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటు వేడిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈరోజు జోగులంబ గద్వాల్, నారాయాణ్ పేట్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. దీంతో పాటు ఈ నెల 23వ తేదీ నుంచి పొడి వాతావరణం నెలకొంటుందని కూడా పేర్కొంది.
Next Story