Tue Mar 17 2026 03:38:14 GMT+0530 (India Standard Time)
ప్రపంచ కప్ లో గట్టెక్కించేదెవరు?
టీ 20 ప్రపంచకప్ కు సమయం దగ్గరపడుతుంది. కానీ టీం ఇండియా ఆటగాళ్లు వరసగా గాయాలపాలవుతున్నారు

టీ 20 ప్రపంచకప్ కు సమయం దగ్గరపడుతుంది. కానీ టీం ఇండియా ఆటగాళ్లు వరసగా గాయాలపాలవుతున్నారు. ఆసీస్ గడ్డమీద జరిగే టీ 20 వరల్డ్ కప్ లో పిచ్ లన్నీ పేస్ లకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే జస్పిత్ బూమ్రా ఆటకు దూరమయ్యాడు. వెన్నునొప్పితో బూమ్రా గాయాలపాలయి మెగా టోర్నీకి దూరంగా ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ కు కూడా బూమ్రా అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకున్నారు.
పేస్ బౌలర్లు...
ప్రపంచకప్ లో సిరాజ్ ను కొనసాగిస్తారా? లేక దీపక్ చాహర్, మహ్మద్ షమీని తీసుకువస్తారా? అన్నది ఇంకా తెలియదు. ఇప్పటికి రవీంద్ర జడేజా, జస్పిత్ బూమ్రా గాయాలపాలయి ప్రపంచ కప్ కు దూరమయ్యారు. దీంతో భారత్ అభిమానుల్లో నిరాశ నెలకొంది. జస్పిత్ బూమ్రా ఆసీస్ పిచ్ లపై నాణ్యమైన బౌలింగ్ చేయగలడు. తక్కువ పరుగులు ఇచ్చి ఎక్కువ విక్కెట్లు తీయగలడు. బూమ్రా ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నాడు. ఆడతాడా? లేదా? అన్నది చివరి నిమిషం వరకూ సందేహమే.
పవర్ ప్లే.. డెత్ ఓవర్స్...
అసలే భారత్ బౌలింగ్ బలహీనంగా ఉంది. ప్రధానంగా పవర్ ప్లే, డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇస్తుండటం ఆందోళన కల్గిస్తుంది. స్పిన్నర్లు, పేసర్లలో ఎవరూ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దక్షిణాఫిక్రాతో జరిగిన తొలి వన్డేలో మాత్రం అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్ లు మెరిశారు. కానీ అదే మెరుపులు కొనసాగిస్తారా? లేదా? అన్నది తెలియదు. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పరిస్థిితి కూడా ఆశాజనకంగా లేదు. తక్కువ వికెట్లను ఈ సీజన్ లో తీసుకున్నాడు. ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు.
మరి ఎలా సాధ్యం...?
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా గాయలపాలై ప్రపంచ కప్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో బౌలర్లు పటిష్టంగా లేకపోతే వరల్డ్ కప్ లో భారత్ పరిస్థితి ఏంది? అన్న ప్రశ్న ప్రతి అభిమానికి ఎదురవుతుంది. ఆసియా కప్ లోనూ శ్రీలంక, పాకిస్థాన్ పై ఓటమిని మరువలేం. ఈ ఓటమి నుంచి తేరుకున్నారా? అంటే అవునని చెప్పడానికి వీలు లేదు. డెత్ ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడం భారత్ కు మైనస్ పాయింట్ గా కనిపిస్తుంది. మరి దీని నుంచి బయటపడి ప్రపంచకప్ కు ఎలా భారత్ బౌలర్లు సన్నద్ధమవుతారన్నది వేచి చూడాలి.
Next Story

