Sat Mar 21 2026 15:03:53 GMT+0530 (India Standard Time)
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. విజయవాడకు చెందిన ముగ్గురు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన ముగ్గురు మరణించారు

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ వాసులు మరణించారు. కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య ఆయన ఇద్దరు కుమార్తెలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఆయన స్వగ్రామమైన పామర్రు మండలం కురుమద్దాలి గ్రామంలో విషాదం అలుముకుంది. డాక్టర్ శ్రీనివాస్ హ్యూస్టన్ లో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య వాణి ఐటీ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నారు. పెద్ద కుమార్తె డాక్టర్ చదువుతుండగా, చిన్న కుమార్తె 11వ తరగతి చదువుతోంది.
దసరా పండగ కోసం...
అయితే దసరా పండగ కోసం పెద్ద కుమార్తెను హ్యూస్టన్ కు తీసుకురావడానికి వాణితో పాటు ఆమె చిన్న కుమార్తె కారులో బయలుదేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరి కారు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ప్రమాద స్థలిలోనే ఇద్దరు చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మరణించారు. గుంటూరు మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించిన తర్వాత శ్రీనివాస్ 1995లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. పీడియాట్రిక్ కార్డియో వాస్క్యులర్ అనస్థిషియాలజస్ట్ శ్రీనివాస్ కు మంచి పేరుంది. 2017 నుంచి తాను సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి కొడాలి రామ్మోహనరావు విజయవాడలో స్థిరపడ్డారు. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మృతి పట్ల తానా సభ్యులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Next Story

