Thu May 09 2024 08:35:10 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ఎనిమిది మంది మృతి
కందుకూరులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగింది.
కందుకూరులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్యకర్తలు మృతి చెందారు. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన సభలో తొక్కిసలాట జరిగి కాల్వలో కార్యకర్తలు పడిపోయారు. కింద పడిన వారిపై కార్యకర్తలు పదుల సంఖ్యలో పడిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. గుండంకట్ట అవుట్ లెట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పెద్ద సంఖ్యలో చంద్రబాబును చూసేందుకు కార్కకర్తలు తరలి వచ్చారు.
ప్రసంగం ఆపాలని...
ప్రమాద వార్త తెలిసిన వెంటనే చంద్రబాబు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని నేతలను ఆదేశించారు. కొండపి ఎమ్మెల్యే స్వామిని ప్రత్యేకంగా పంపారు. కార్యకర్తల ఆరోగ్య పరిస్థితి తెలిసేంత వరకూ తాను మాట్లాడబోనని చంద్రబాబు తన ప్రసంగాన్ని నిలిపేశారు. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లలో పడి పోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. చంద్రబాబు ప్రసంగించకుండానే ఆసుపత్రికి వెళ్లి కార్యకర్తలను పరామర్శిస్తున్నారు. కందుకూరు పాత ప్రకాశం జిల్లాలోనిది. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల పరిహారాన్ని చంద్రబాబు ప్రకటించారు. వారి పిల్లల చదువును పార్టీయే చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. కందుకూరు సభను సంతాప సభగా చంద్రబాబు ప్రకటించారు.
Next Story