11 మందిని పొట్టన పెట్టుకున్నారే....!
తమిళనాడులోని తూత్తకూడిలో ఓ పరిశ్రమను మూసివేయాలంటూ స్థానికులు చేసిన ఆందోళన హింసకు దారితీసింది. స్టిరిలైట్ రాగి పరిశ్రమను మూసివేయాలని గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగున్నాయి. అయితే, మంగళవారం జరిగిన ఆందోళన అదుపుతప్పింది. మొదట సదరు పరిశ్రమను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు దగ్గర్లోనే ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని చొచ్చుకెళ్లారు. కార్యాలయంపై దాడిచేసి, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. అనేక రోజులుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకుండా, లాఠీఛార్జీ చేయడంతో ఆందోళనకారుల్లో ఆగ్రహం పెల్లుబీకింది. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పంటించారు. దీంతో ఆందోళనను అదుపు చేసేందుకు పోలీసులు నేరుగా ప్రజలపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది ఆందోళనకారులు మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.