ఏకులా వచ్చి ఆ మంత్రికి మేకులా మారిన లేడీ లీడర్..!

ఏకు మేకై.. తర్వాత చాకవ్వడమంటే ఇదేనేమో! రాజకీయాల్లోకి రావాలని.. ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచన మంచిదే అయినా.. రాజకీయాల్లోకి రావడానికి అవకాశమిచ్చిన వ్యక్తిని కాదని తనకు టికెట్ ఇవ్వాలని కోరడం అత్యాశే అవుతుంది! అంతేగాక ఇక్కడి నుంచి అవకాశం దక్కకపోతే.. ప్రత్యర్థి పార్టీ నుంచి అయినా బరిలోకి దిగి.. ఆ గురువునే ఓడించేస్తాననని శపథం చేయడంతో అంతా అవాక్కవుతున్నారు. గురువు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అయితే.. ఆ శిష్యురాలు చిలకలూరిపేటకు చెందిన రజనీకుమారి! మరి గురువు కుర్చీకే ఎసరు పెట్టిన ఆమె ఎవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అంటే..
అధినేత అంటే అభిమానం అని చెప్పి
టీడీపీకి అమెరికాలోనూ అభిమానులు ఉన్నారు. అందుకే 2014 ఎన్నికల్లో సొంతూళ్లకు వచ్చి టీడీపీ గెలుపు కోసం తమ వంతుగా కృషి చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇలాంటి వారిలో రజనీకుమారి కూడా ఒకరు. అమెరికాలో వ్యాపారం చేసుకుంటున్న ఆమె కుటుంబం బాగానే ఆర్జించింది. చంద్రబాబు అంటే వల్లమాలిన అభిమానమని, పార్టీలో పనిచేస్తానని చెప్పడంతో.. నియోజకవర్గానికి చెందిన మంత్రి పత్తిపాటి పుల్లారావు పార్టీలో చేర్చుకున్నారు. విశాఖలో జరిగిన మహానాడులో ఆమె యాక్టివ్గా పనిచేసి అందరి దృష్టిలో పడ్డారు. ఆ సందర్భంలోనే ఆమెను పార్టీ అధినేత చంద్రబాబుకు పరిచయం చేశారు పుల్లారావు. అంతేగాక రజనీకుమారి మామకు మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ పదవిని కూడా ఇచ్చేలా చేశారు.
పుల్లారావుకే చిలకలూరిపేట...
ఇదే సమయంలో ఆమె చిలకలూరిపేట నుంచి పోటీచేయాలని భావించారట. అనుకున్నదే తడవుగా కుటుంబ సభ్యులను రంగంలోకి దించి మంతనాలు ప్రారంభించారు. నేరుగా చంద్రబాబునే కలిశారు. చిలకలూరిపేట సీటు కావాలని అడిగారు. దీంతో చంద్రబాబు షాక్ అయ్యారట. చిలకలూరిపేట సీటు పుల్లారావుకే ఇస్తామని పార్టీ హైకమాండ్ తేల్చేసింది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడంతో పాటు... పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన ఆయన్ను కాదని.. వేరొకరికి సీటు ఇవ్వలేమని తేల్చేసింది. చిలకలూరిపేట టికెట్ తనకే కావాలని రజనీకుమారి పట్టుబడుతూ వచ్చారు. చివరకు అధిష్టానం కూడా 'నో' చెప్పడంతో వైఎస్సార్ కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించారట! అంతేగాక పుల్లారావును ఎలాగైనా ఓడించి తీరతానని శపథం కూడా చేశారట! పాదయాత్రలో భాగంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించిన జగన్మోహన్రెడ్డి వద్దకు రాయబారం పంపారట.
టిక్కెట్ పై హామీ ఇవ్వని జగన్
అక్కడ తమ అభ్యర్థిగా ఉన్న మర్రి రాజశేఖర్ను కాదని వేరే వారికి టికెట్ ఎలా ఇస్తామని జిల్లా నేతలతో జగన్ వ్యాఖ్యానించారట! పార్టీ ఫండ్తో పాటు ఎన్నికలకు అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని రజనీకుమారి చెప్పినా జగన్ వైపు నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదట..! తనను పార్టీకి పరిచయం చేసిన పుల్లారావుకే రజనీకుమారి రాజకీయ ప్రత్యర్థిగా మారడం.. ఆయన్ను ఓడించి తీరుతానని ప్రతినబూనడం ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. చంద్రబాబు మీద అభిమానం ఉందని చెప్పడం వల్లే అమెను అధినేతకు పరిచయం చేశామని... ఇప్పుడు ఆమే తనకు ఏకు మేకులా మారుతుందని ఊహించలేదని... పుల్లారావు సన్నిహితుల వద్ద వాపోతున్నారట.
