Sat Mar 28 2026 23:17:46 GMT+0530 (India Standard Time)
ఒక్క ఎన్నికతోనే పక్కన పెట్టేశారే?
గత ఎన్నికల్లో బండారు శ్రావణి శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యా,రు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంకా కొందరు నేతల మాయ మాటలను వింటున్నట్లే కనపడుతుంది. వారు చెప్పినట్లుగానే నిర్ణయాలు తీసుకుంటుండటంతో పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతుంది. గెలవగల సత్తా ఉన్న నేతలను సయితం చంద్రబాబు పక్కన పెట్టిస్తుండటం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చంద్రబాబు కొందరి మాటలకే విలువ ఇస్తున్నారని స్థానిక నేతలు సయితం ఆరోపిస్తున్నారు.
గత ఎన్నికలలో....
గత ఎన్నికల్లో బండారు శ్రావణి శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యా,రు. వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఆమె ఓడిపోయారు. అయినా ఆమె శింగనమలకు టీడీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే శింగనమలలో ఒక వర్గం నేతలు ఆమె నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. అగ్రకులానికి చెందిన నేతలు బండారు శ్రావణి ఉంటే తాము పార్టీకి పనిచేయమని చంద్రబాబుకు తెగేసి చెప్పారు.
టూ మెన్ కమిటీ....
ీదీంతో శింగనమల నియోజకవర్గం లో పార్టీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి చంద్రబాబు సీనియర్ నేతలతో టూ మెన్ కమిటీని నియమించారు. ఈ కమిటీకే నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుంచి బండారు శ్రావణి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. లోకేష్ ను కలిసినా ప్రయోజనం లేెకపోవడంతో ఆమె ఇన్ ఛార్జిగా ఉన్న శింగనమలలో పెద్దగా పట్టించుకోవడం లేదు.
వచ్చే ఎన్నికల్లో.....
బండారు శ్రావణి జేసీ దివారెడ్డి వర్గీయులు. ఆ కుటుంబ సహకారంతోనే ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ కారణంతోనే బండారు శ్రావణిని పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. జేసీ కుటుంబాన్ని కేవలం తాడిపత్రి, అనంతపురం ఎంపీ స్థానాలకే పరిమితం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బండారు శ్రావణిని దూరం పెట్టారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందంటున్నారు. మొత్తం మీద ఈ యువ మహిళా నేత రాజకీయ ప్రభ ఒక్క ఎన్నికతోనే మసకబారినట్లయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Next Story

