ఈయన బాబా కాదు.... బడా చోర్...!
ఒకప్పుడు ఢిల్లీలో వ్యాపారవేత్త...అంతకుముందు అదే ఢిల్లీలో క్రిమినల్ చరిత్ర... కానీ ఇప్పుడు బాబా. మామూలు బాబా కాదు గోల్డెన్ బాబా. ఒంటిపై రూ.ఆరు కోట్ల విలువైన 20 కిలోల బంగారం ధరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. గోల్డెన్ బాబా అసలు పేరు సుధీర్ మక్కర్. స్వస్థలం ఢిల్లీ. కొన్నేళ్ల కిందట బాబాగా మారిపోయాడు. అయితే, తనపై ఉన్న క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకోవడానికే బాబాగా మారాడనే ప్రచారమూ ఉంది. ప్రతీయేటా శివభక్తులు హరిద్వార్ కు యాత్రగా వెళ్తారు. దీనినే కన్వర్ యాత్ర అంటారు. ఈ యాత్రలో గోల్డెన్ బాబా స్పెషల్ అట్రాక్షన్. గోల్డెన్ బాబా ఏకంగా 20 కిలోల బంగారంతో 200 కిలోమీటర్ల ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఇది బాబాకు 25వ యాత్ర.
150 కోట్ల ఆస్తులు...
మొదట్లో బాబా కొంత బంగారమే ధరించి యాత్రకు వచ్చేవారు. కానీ, ప్రతీయేటా ఆయన ధరించే బంగారం పెరుగుతోంది. 2016లో 12 కేజీల బంగారం వేసుకోగా, గత సంవత్సరం 14.5 కిలోలు, ఈయేడు ఏకంగా 20 కిలోలు ధరించారు. ఇందులో 21 గొలుసులు, 21 లాకెట్లు, బ్రాస్లేట్లు, ఉంగురాలు ఉన్నాయి. దీంతో మొత్తం యాత్రలో బాబా స్పెషల్ అట్రాక్షన్. వీటిని ఎల్లవేళలా భద్రంగా చూసుకునేందుకు పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటుచేశారు. 56 ఏళ్ల గోల్డెన్ బాబాకు బీఎండబ్లూ కారుతో పాటు 150 కోట్ల ఆస్తులు కూడా ఉండవచ్చని అంచనా. అయితే, వచ్చేసారి నుంచి ఇంత భారీ ఎత్తున బంగారం ధరించనని, బంగారం బరువు కారణంగా మెడనరాలు, కంటిచూపు దెబ్బదింటోందని బాబా ప్రకటించడం కొసమెరుపు.