Wed Mar 18 2026 06:28:12 GMT+0530 (India Standard Time)
ఈయనకు మంత్రి పదవి ఇవ్వండి బాబోయ్
ఎందుకో ఈ మధ్య ధర్మాన ప్రసాదరావు అసహనానికి గురవుతున్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు

ఎందుకో ఈ మధ్య ధర్మాన ప్రసాదరావు అసహనానికి గురవుతున్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తుండటం పార్టీలో చర్చనీయాంశమైంది. ధర్మాన ప్రసాదరావు కావాలనే ఈ కామెంట్స్ చేస్తున్నారా? లేక అన్యాపదేశంగా చేస్తున్నారా? అన్నది తెలియదు కాని గత రెండు రోజుల నుంచి ధర్మాన ప్రసాదరావు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా పార్టీకి ఇబ్బందికారంగా మారాయి.
అనుభవమున్న నేతగా...
ధర్మాన ప్రసాదరావు ఆషామాషీ నేత కాదు. ఆయన అనుభవమున్న నేత. మంత్రిగా పనిచేశారు. ఆయనకు అన్ని విషయాలపై సంపూర్ణ అవగాహన ఉంది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతున్నా తాను మంత్రిని కాలేకపోయానన్న దిగులు తప్పించి ఆయన పార్టీలో కంఫర్ట్ గానే ఉన్నారు. కానీ ఎందుకో అప్పుడప్పుడు మంత్రి పదవి విషయం మెదడును తొలుస్తున్నట్లుంది. అందుకే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
చెత్త పన్నుపై నిన్న....
ధర్మాన ప్రసాదరావు నిన్న చెత్త పన్నుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెత్త పన్ను వందరూపాయలు చెల్లించకపోతే వారి ఇంటిముందు పారేయమని పిలుపు నిచ్చారు. పన్ను చెల్లించని వారి ఇళ్ల ముందు చెత్తను పారేయమని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో అది రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమయింది. విపక్షాలు ధర్మాన వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. చెత్త పన్ను మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమై పార్టీ ఇరకాటంలో పడింది.
ఉపాధి పథకంపై నేడు....
ఇక ఈరోజు తాజాగా ఉపాధి హామీ పధకంపై కూడా ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకంతో పోరంబోకులను తయారు చేసినట్లవుతుందన్నారు. ఉపాధి హామీ పథకం కింద రెండు గంటలకు డబ్బులు ఇస్తుంటే, పూట పని కోసం వ్యవసాయ పనులకు ఎవరు వస్తారని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. రైతులు ఇక బతకలేరు అని అన్నారు. ఈ పథకాల రూపకల్పన దేశ వినాశనానికి దారితీస్తాయని అన్నారు. ఉపాధి హామీ పథకం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ధర్మాన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ పథకం ఉంది. కానీ ఇప్పుడే ఈ పథకంపై ఆయన వ్యాఖ్యలు చేసి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టారని పిస్తుంది. ీఅర్జంటుగా ఈయనకు మంత్రి పదవి ఇవ్వండి బాబో అని వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంది.
Next Story

