Tue May 14 2024 21:18:54 GMT+0000 (Coordinated Universal Time)
అగ్నిప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి.. రూ.25 లక్షల నష్టపరిహారం
అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో గతరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన విషయం..
అమరావతి : ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ రసాయన పరిశ్రమలో గతరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తీవ్రగాయాలపాలైన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.
మరోవైపు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గతరాత్రి పోరస్ రసాయన పరిశ్రమలోని యూనిట్-4లో గతరాత్రి గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో రియాక్టర్ పేలిపోయింది. ఫ్యాక్టరీ అంతా మంటలు చెలరేగడంతో.. ఐదుగురు సజీవదహనమవ్వగా.. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన 13 మందికి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Next Story