బాలయ్య భలే చెప్పారే....!

చంద్రబాబు ధర్మపోరాటం దీక్ష విజయవంతం మాట ఎలా వున్నా బామ్మర్ది బాలకృష్ణ రేపిన మాటల దుమారం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ప్రధాని మోడీని అభ్యంతరకర భాషలో బాలకృష్ణ దూషించారని కమలనాధులు కన్నెర్ర చేశారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ తో మొదలైన ఉద్యమం తెలుగు రాష్ట్రాలను వేడెక్కిస్తుంది. మొదట బాలయ్య ఇంటిపై దాడి చేసిన కమలం ఆ తరువాత తెలుగురాష్ట్రాల్లో దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం చక చక జరిగిపోతున్నాయి. బాలకృష్ణ ఇంటిపై బిజెపి దాడి చేసిన సమయంలోనే ఆయన ఇంటినుంచి బయటకు రావడంతో ఉద్రిక్తత తీవ్ర స్థాయికి చేరిపోయింది. అయితే బాలకృష్ణ కారులోనే దణ్ణం పెడుతూ సాగిపోయారు.
గుంటూరు కి సాగిన సెగ ...
జయసింహ శతదినోత్సవ వేడుకలకు బిజెపి అడ్డుపడింది. బాలకృష్ణ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇక ఇరు రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా బాలకృష్ణ కు వ్యతిరేకంగా పెద్దపెట్టున ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనాలు చక చకా సాగిపోయాయి. ఇక ఆయన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపారేస్తున్నారు బిజెపి నేతలు. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుతగలేకపోతే వివాదాలు పెరిగి పెద్దవి అయ్యేవి.
నోరువిప్పిన బాలయ్య ...
ఎట్టకేలకు బాలకృష్ణ నోరు విప్పారు .తాను మోడీని దుర్భాషలాడింది నిజం కాదన్నారు. తాను ప్రజాస్వామ్య పరిభాషనే ఉపయోగించానని చెప్పుకొచ్చారు. అవసరమైతే తను మాట్లాడిన వీడియో పరిశీలించుకోవాలని సవాల్ చేశారు. బాలయ్య తాజా సవాల్ తో బిజెపి వెర్సెస్ బికె నడుమ యుద్ధం తారాస్థాయికి చేరుకునేలాగే కనిపిస్తుంది.
