Sat Jul 27 2024 01:08:11 GMT+0000 (Coordinated Universal Time)
అవినాశ్ బెయిల్ పై వాదనలు పూర్తి.. రేపు ?
ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి - వివేకాతో భూ తగాదాలు ఉన్నాయని, అలాగే సునీల్, ఉమాశంకర్ కు..
![avinash reddy bail petition arguments avinash reddy bail petition arguments](https://www.telugupost.com/h-upload/2023/05/26/1505347-ys-avinash-reddy.webp)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ నేడు విచారణ చేసింది. అవినాష్ తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు సుమారు ఐదున్నర గంటల పాటు వెకేషన్ బెెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ ఎదుట వాదనలు వినిపించారు. వివేకా హత్యానంతరం జరిగిన పరిణామాలను వివరిస్తూ.. ఎఫ్ఐఆర్, దర్యాప్తుల గురించి తెలిపారు.
వివేకా హత్యకేసులో అవినాష్ నిందితుడని సీబీఐ ఎక్కడా నమోదు చేయలేదన్నారు. గుండెపోటు అన్నంత మాత్రాన అతను నేరం చేసినట్టు కాదన్నారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి - వివేకాతో భూ తగాదాలు ఉన్నాయని, అలాగే సునీల్, ఉమాశంకర్ కు వివేకాతో వ్యాపారంలో విబేధాలున్నాయని న్యాయవాది ఉమామహేశ్వరరావు హైకోర్టుకు తెలిపారు. డ్రైవర్ గా ఉన్న దస్తగిరిని తొలగించి.. అతని స్థానంలో ప్రసాద్ ను నియమించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణం అవినాషే అని వివేకా భావించారు. ఆయన ఎందుకు ఓడిపోయారన్నది స్వయంగా సాక్షులే తెలిపారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ టికెట్ విషయాల్లోనే సీబీఐ అవినాష్ ను అనుమానిస్తోందన్నారు.
వివేకా హత్య తర్వాత వేసిన రెండు ఛార్జ్ షీటుల్లో ఎక్కడా అవినాష్ ప్రస్తావన తీసుకురాలేదన్నారు. అనుబంధ ఛార్జిషీటు వేసిన ఏడాది తర్వాత.. 160 నోటీసులు ఇచ్చారన్న అవినాష్ న్యాయవాది.. ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకోగానే అరెస్ట్ చేయాలని సీబీఐ పట్టుబడుతోందని వివరించారు. సీబీఐ విచారణ అంటే.. ఆడియో, వీడియో రికార్డులు చేసి వాటిని కోర్టులో ప్రజెంట్ చేయాలి. కానీ సీబీఐ కస్టోడియల్ విచారణ చేయాలనడం వెనుక దురుద్దేశం ఉందని లాయర్ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. అవినాష్ తరపు న్యాయవాది వాదనలు విన్న కోర్టు.. రేపు సీబీఐ వాదనలు వింటామని తెలిపింది. రేపు సీబీఐ కోర్టులో ఏం చెప్తుందా ? అని అంతా ఎదురుచూస్తున్నారు.
Next Story