Mon Mar 30 2026 05:01:14 GMT+0530 (India Standard Time)
గుజరాత్ తరహా గేమ్ ప్లాన్ అట
గుజరాత్ తరహా వ్యూహాలను వచ్చే ఎన్నికల్లో అమలు పర్చాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి

గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి. ఏడోసారి బీజేపీ విజయం సాధించింది. ఇందుకు అనేక కారణాలుండవచ్చు. మోదీ క్రేజ్ కావచ్చు. బలహీనమైన ప్రతిపక్షాలు కావచ్చు. చేసిన.. చేస్తున్న అభివృద్ధి కంటికెదురుగా కన్పించి కావచ్చు. మోదీని ఇక్కడ ఓడిస్తే ఆయన ఒక గుజరాతీగా ప్రపంచం ముందు తలదించుకోవాల్సిందని భావించవచ్చు. కారణం ఏదైనా ఏడోసారి గుజరాత్ లో బీజేపీ విజయం సాధించింది. చాలా అరుదైన విషయం. ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ అయిన బిజూ జనతాదళ్ కూడా ఐదుసార్లు విజయం సాధించింది. ఇది అందరివల్ల సాధ్యం కాదు. కొందరికే సాధ్యమవుతుంది. రెండోసారి గెలవాలంటేనే అష్టకష్టాలు పడే రోజుల్లో బీజేపీ ఏడు సార్లు విజయం సాధించడమంటే సామాన్య విషయమేమీ కాదు.
అనేక ప్రయోగాలు...
అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ అధినాయకత్వం అనేక ప్రయోగాలు చేసింది. ఎప్పటికప్పుడు కొత్త నీరుకు అవకాశమిస్తుంది. ముఖ్యమంత్రులను మార్చేస్తుంది. అయినా మోదీని చూసే గుజరాతీలు కమలం పార్టీ వైపు నిలబడుతున్నారు. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలోనూ అదే రకమైన చర్చ జరుగుతోంది. గుజరాత్ తరహా వ్యూహాలను వచ్చే ఎన్నికల్లో అమలు పర్చాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ లో 48 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కలేదు. అందులో మంత్రులను కూడా పక్కన పెట్టారు. కానీ వారు మోదీ, షాల నిర్ణయానికి కట్టుబడి కొందరు ఉన్నారు. మరికొందరు రెబల్ గా పోటీ చేశారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం ఎక్కడకక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొంత చీల్చుకోవడంతో బీజేపీ బాగా లబ్ది పొందిందనే వాదన కూడా లేకపోలేదు.
ఏపీలో ఆ పరిస్థితులున్నాయా?
కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితులు ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. ఇక్కడ అలాంటి సెంటిమెంట్ లేదు. బలహీనమైన ప్రతిపక్షం అంటూ లేదు. జగన్ ఓటమి పాలయితే ఏమవుతుందోనన్న ఆందోళన ఆంధ్రప్రజల్లో అసలే ఉండదు. కానీ జగన్ కు ఒక అనుకూలత కూడా ఉంది. అభ్యర్థులను మార్చగల ధైర్యం ఉంది. మంత్రులను తప్పించగల సత్తా జగన్ కు ఉంది. అంతవరకూ జగన్ చేయగలరు. దాంతోనే గెలుపు సాధ్యమవుతుందా? అంటే చెప్పలేం. ఎందుకంటే జగన్ పాలనపై సంతృప్తి ఎన్ని వర్గాల్లో ఉందో? అంతే అసంతృప్తి మరికొన్ని వర్గాల్లో నెలకొని ఉంది. ముఖ్యంగా ధనిక, ఎగువ మధ్యతరగతి ప్రజలతో పాటు ప్రభుత్వోద్యోగులు సయితం జగన్ ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. కానీ వీరిలో ఎంతమంది పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తారన్నదే ప్రశ్న.
జగన్ ఆశలన్నీ...
జగన్ ఆశలన్నీ పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు, మహిళలపైనే. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రత్యేకంగా తనకంటూ ఓటు బ్యాంకును ఏర్పరచుకుంటూ వస్తున్నారు. దాదాపు మూడున్నర కోట్ల కుటుంబాలకు ఆర్థికంగా లబ్ది చేకూర్చేలా వివిధ పథకాల ద్వారా నేరుగా.. ఠంచనుగా వారి ఖాతాల్లో నగదును జమ చేస్తున్నారు. ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి రెండు నుంచి పది లక్షలు వచ్చిన కుటుంబాలు కూడా ఉన్నాయి. జగన్ అధికారంలోకి రాకపోతే ఈ సొమ్ములు తమకు రావన్న భయం వారిలో ఉన్నంత కాలం ఈ ఓట్లు వైసీపీ గడప దాటి ఎటూ పోవు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వీరందరినీ పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి తమకు ఓటు వేయించుకోవాల్సిన బాధ్యత కిందిస్థాయి కార్కకర్తలపై ఉంది. అందులో సక్సెస్ అయితే కనీసం 175 నియోజకవర్గాలని చెబుతున్నా.. 95 స్థానాలను దక్కించుకుని రెండోసారి అధికారంలోకి వచ్చే వీలుంది.
పదిరోజుల డెడ్లైన్...
అందుకే జగన్ నిన్న ఎమ్మెల్యేలు, పరిశీలకులు, జిల్లా ఇన్ఛార్జులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీలతో పాటు ప్రతి యాభై ఓటర్లకు ఒక పార్టీ ప్రతినిధిని నియమించాలని ఆదేశించారు. ప్రతి యాభై కుటుంబాలను ఒక క్లస్టర్ గా చేశారు. ప్రతి క్లస్టర్ కు ప్రతినిధిని నియమించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 5.20 లక్షల మంది గ్రామ సారధులను నియమించుకోవాలని జగన్ నేతలను ఆదేశించారు. ప్రతి క్లస్టర్ కు ఇద్దరు గ్రామ సారధులను నియమించాలని సూచించారు. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్లను నియమించుకోవాలని చెప్పారు. డిసెంబరు 20వ తేదీకల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. మరి గుజరాత్ ఎన్నికల తరహాలోనే కనీసం రెండు కోట్ల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకునేందుకు వీలుగా ప్రచార కార్యక్రమాన్ని కూడా రూపొందించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరి చివరకు ఫలితం ఎలా ఉంటుందో తెలీదు కానీ గుజరాత్ లో సాధ్యం అయింది.. ఇక్కడ ఎందుకు కాదు? అన్న ప్రశ్నను నేతల ముందు జగన్ ఉంచారని చెబుతున్నారు.
Next Story

