Thu Mar 19 2026 07:23:53 GMT+0530 (India Standard Time)
జగన్ కు ఏప్రిల్ గండం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఏప్రిల్ గండం లేకపోలేదు. ఏప్రిల్ లో మంత్రి వర్గ విస్తరణ వచ్చే నెలలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఏప్రిల్ గండం లేకపోలేదు. ఏప్రిల్ లో మంత్రి వర్గ విస్తరణ వచ్చే నెలలో ఉంది. ఈ విస్తరణ తర్వాత ఖచ్చితంగా అసంతృప్తి చెలరేగే అవకాశముంది. మంత్రివర్గం నుంచి బయటకు వెళ్లిపోయిన మంత్రులు పెద్దగా అసంతృప్తికి గురి కాకపోయినా కొందరు నేతలు పార్టీకి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచే తొలి దెబ్బ పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.
వైసీపీలో ప్రాధాన్యత లేక.....
ఇప్పటికే జగన్ సొంత జిల్లా కడప నుంచి సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. ఆయన త్వరలోనే టీడీపీ, బీజేపీలో ఏదో పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఇక ఉత్తరాంధ్ర నుంచి మరో సీనియర్ నేత కూడా పార్టీని వీడేందుకు రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలోనే ఉత్తరాంధ్రకు చెందిన దాడి వీరభద్రరావు పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది.
తిరిగి టీడీపీలో చేరినా....?
దాడి వీరభద్రరావు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. మళ్లీ వైసీపీలోకి 2019 ఎన్నికలకు ముందు చేరారు. అయితే దాడి కుటుంబానికి ఈ మూడేళ్లకాలంలో జగన్ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఉత్తరాంధ్రలో తనకంటే జూనియర్లు ఎమ్మెల్సీలు అయ్యారని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అందుకే దాడి వీరభద్రరావు త్వరలోనే జనసేనలో చేరే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
పవన్ స్వయంగా వెళ్లి....
గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా వెళ్లి దాడి వీరభద్రరావును కలసి వచ్చారు. టీడీపీలోకి తిరిగి వెళ్లినా ఆయనకు పెద్దగా ప్రయారిటీ ఉండదు. అదే జనసేన అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో వెళ్లి అధికారంలోకి వస్తే ఆ కోటాలో పదవి పొందే అవకాశాలున్నాయి. అందుకే సీనియర్ నేత దాడి వీరభద్రరావు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తన సొంత నియోజకవర్గంలోనూ జనసేన అయితేనే బెటర్ అని భావిస్తున్నారు. మొత్తం మీద ఉత్తరాంధ్ర నుంచి తొలి జంప్ దాడి వీరభద్రరావు రూపంలో ఉంటుందంటున్నారు.
Next Story

