Tue Feb 03 2026 00:24:43 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీకి ఎన్నికలంటే భయం...అందుకని?

కేంద్రంపై వత్తిడి పెంచేందుకే తాను రెండురోజుల ఢిల్లీ పర్యటన పెట్టుకున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆయన కొద్దిసేపటి క్రితం టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించి మోసం చేస్తే బీజేపీ నమ్మించి మోసం చేసిందన్నారు. బీజపీ మోసాన్ని ఎండగట్టడానికే తాను ఢిల్లీకి వస్తున్నానని చెప్పారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో వ్యక్తిగతంగా అన్ని పార్టీల నేతలనూ కలిసి ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని చెప్పారు. అత్యున్నత చట్ట సభల్లో ఇచ్చిన హామీలకు విలువలేదా? అని ప్రశ్నించారు. వైసీపీ లాలూచీ రాజకీయాలు ప్రజలందరికీ అర్థమయ్యాయని, వైసీపీకి ఎన్నికలంటే భయమని, అందుకే ఉప ఎన్నికలు రాకుండా చివరిరోజు రాజీనామాల డ్రామాకు తెరతీశారని చెప్పారు. పార్లమెంటు లోపల, బయట ఆందోళనను కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
Next Story
