లగడపాటికి చంద్రబాబు గట్టిదెబ్బ కొట్టారే?

లగడపాటికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెడిటెక్ జోన్ టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. మెడిటెక్ జోన్ టెండర్లపై తొలి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కు చెందిన ల్యాంకో సంస్థ ఈ టెండర్లను గతంలో దక్కించుకుంది. గతంలో 400 కోట్లకు టెండర్లు పిలిస్తే లగడపాటికి చెందిన ల్యంకో 2432 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఇంత పెద్దమొత్తంలో తేడా రావడంతో ఆరోపణలు విన్పించాయి. విశాఖపట్నంలో 200 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ ను ఏర్పాటు చేయాలని తలిచారు. దీనికి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా లగడపాటికి చెందిన ల్యాంకో దక్కించుకుంది. అయితే ఈ టెండర్లపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. తిరిగి టెండర్లను ఆహ్వానించారు. లగడపాటి సంస్థ టెండర్లు దక్కించుకున్నా పనులు చేయకపోవడంతోనే రద్దు చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి.
అందుకేనా తరచూ కలిసేది?
లగడపాటి తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తుంది ఈ విషయం కోసమేనా? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. మెడిటెక్ జోన్ పై గత ఏడాదిగా వివాదం జరుగుతుంది. మెడిటెక్ సీీఈవో జితేంద్ర శర్మ పై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ప్రత్యేకంగా విచారించింది. ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయని నిర్ధారించడంతో టెండర్లను రద్దు చేశారు. లగడపాటి ముఖ్యమంత్రిని కలిసినప్పుడల్లా ఇదే విషయంపై చర్చించేవారని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. నిన్న రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ ను పోలవరం కాంట్రాక్టు పనుల నుంచి తప్పించిన చంద్రబాబు, ఈసారి లగడపాటి కి చెందిన ల్యాంకోను తప్పించారు.
- Tags
- లగడపాటి

