రాజ్యసభ ఎన్నికల తర్వాత పండగే...పండగ

రాజ్యసభ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో పదవుల పందేరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీ అయిపోయారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయకపోవడంతో తెలుగుతమ్ముళ్లలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో నామినేటెడ్ పోస్టులతో పాటు వివిధ కార్పొరేషన్ పోస్టులను కూడా భర్తీ చేయాలని సీఎం యోచిస్తున్నారు. ఆదివారమే నామినేటెడ్, కార్పొరేషన్ పోస్టుల భర్తీ విషయమై సీఎం చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చించారు.
కోడ్ అమల్లో ఉన్నందున.....
అయితే రాజ్యసభ ఎన్నికలు జరగుతుండటంతో ఈ నెల 23వ తేదీ వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఆ తర్వాత పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం చంద్రబాబు పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. వివిధ జిల్లాల పార్టీ నేతల పనితీరుపై ఇప్పటికే చంద్రబాబు నివేదికలను తెప్పించుకున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి టీడీపీలో పదవులు దక్కుతాయన్న సంకేతాలు ఇవ్వాలన్నదే చంద్రబాబు ఉద్దేశంగా కన్పిస్తోంది.
టీటీడీ పాలకమండలి కూడా.....
ఇప్పటికీ రాష్ట్రానికి ప్రధానమైన టీటీడీ ఛైర్మన్ తో పాటు పాలకమండలిని కూడా నియమించలేదు. దాదాపు ఏడాదిన్నరగా దీనిపై బాబు నిర్ణయం తీసుకోక పోవడంతో కొంత అసంతృప్తి నెలకొంది. లీకులయితే వస్తున్నాయి కాని ఉత్తర్వులు రావడం లేదు. దీంతో టీటీడీ ఛైర్మన్ పోస్టు విషయంలోనూ చంద్రబాబు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. గతంలో టీటీడీ పాలకమండలిలో బీజపీకి కూడా చోటు కల్పించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ సభ్యులకు చోటు ఉంటుందా? లేదా? అన్నది తెలియరాలేదు.
వర్ల రామయ్యకు కీలక పదవి.....
మరోవైపు సామాజికవర్గాల వారీగా కూడా చంద్రబాబు కసరత్తులు చేశారు. పార్టీలో సీనియర్ నేత వర్ల రామయ్యకు రాజ్యసభ పదవి దక్కుతుందన్న ప్రచారం జరిగింది. వర్ల రాయయ్య కూడా దీనిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఊహించని విధంగా పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్ కు రాజ్యసభ అభ్యర్థిత్వం వరించింది. దీంతో వర్లరామయ్యను సీఎం చంద్రబాబు పిలిపించుకుని మరీ హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఆయనకు ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమిస్తారని తెలిసింది. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా కొంతకాలం వరకూ జూపూడి ప్రభాకర్ పనిచేశారు. ఆయన స్థానంలో వర్లను నియమిస్తారని తెలిసింది. అలాగే జూపూడి ప్రభాకర్ ను రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్ గా నియమిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద రాజ్యసభ ఎన్నికల తర్వాత తెలుగు తమ్ముళ్లకు పండగే పండగ.
