Sat Jul 27 2024 01:57:42 GMT+0000 (Coordinated Universal Time)
న్యూ ఇయర్ వేడుకలకు నోటు కష్టాలు
![న్యూ ఇయర్ వేడుకలకు నోటు కష్టాలు న్యూ ఇయర్ వేడుకలకు నోటు కష్టాలు](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2016/12/year-2017.png)
నూతన సంవత్సర వేడుకలు ఈసారి భారత్ లో మందకొడిగా సాగనున్నాయి. నోట్ల రద్దుతో జనం అవస్థలు పడుతుండటంతో హ్యాపీ న్యూ ఇయర్ వేడుక 80 శాతం మంది ప్రజలకు అందుబాటులో లేకుండా పోతోంది. న్యూ ఇయర్ కు నోట్ల సమస్య ఇబ్బందిగా మారుతోంది. తాజాగా బ్యాంకులు ఆర్థిక శాఖకు ఓ ప్రతిపాదనను పంపినట్లు సమాచారం. నగదు విత్ డ్రా పై విధించిన పరిమితులను మరికొన్నాళ్ల పాటు కొనసాగించాలని బ్యాంకులు ఆర్థికశాఖను కోరాయి. ఎందుకంటే అవసరానికి సరిపడా నగదు బ్యాంకుల వద్ద లేదు. ఈ నెల 30వ తేదీ తర్వాత నగదు విత్ డ్రాలపై ఆంక్షలను ఎత్తివేస్తామని ఆర్థిక శాఖ గతంలో ప్రకటించింది. ప్రస్తుతం ఏటీఎం నుంచి రోజుకు 2,500లు, బ్యాంకుల నుంచి వారానికి పదివేలు విత్ డ్రా చేసుకునే అవకాశముంది. అయితే ఇవే ఆంక్షలను మరికొంత కాలం పొడిగించాలని బ్యాంకులు ఆర్థిక శాఖను కోరాయి. కొత్త కరెన్సీ నోట్లు ముద్రణ పూర్తయి....పూర్తిగా బ్యాంకులకు చేరిన తర్వాతనే ఆంక్షలను ఎత్తివేయాలని బ్యాంకర్లు కోరుతున్నారు. అయితే దీనిపై ఆర్థిక శాఖ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. బ్యాంకర్లు చెప్పింది కూడా వాస్తవమే కాబట్టి ఆంక్షలు కొనసాగించాలని ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాకుంటే ఆర్థిక శాఖ మంత్రి ఆమోదం తీసుకున్న తర్వాతనే ఆంక్షల కొనసాగింపు పై ప్రకటన వెలువడే అవకాశముంది. ఇదే జరిగితే మరికొంత కాలం జనానికి కరెన్సీ కష్టాలు తప్పేట్లు లేవు. హ్యాపీ న్యూ ఇయర్ కష్టాల మధ్యనే ప్రారంభం కానున్నదన్నమాట.
- Tags
- న్యూ ఇయర్
Next Story