నయీంతో ఫొటోలు..ఆధారాలు కాబోవట...
![నయీంతో ఫొటోలు..ఆధారాలు కాబోవట... నయీంతో ఫొటోలు..ఆధారాలు కాబోవట...](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2017/02/Nayeem_5.jpg)
నయాంతో అంటకాగుతూ పోలీసు అధికారులు దిగిన ఫొటోలు బయటపడటంపై తెలంగాణ హోం శాఖ మంత్రి నాయని నర్సింహారెడ్డి స్పందించారు. కేవలం ఫొటోలను చూసి చర్యలు తీసుకోలేమన్నారు. సిట్ అధికారుల దర్యాప్తు ఆధారంగానే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయన్న నాయని పత్రికల్లోనో, సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోలు ఆధారంగా ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. నయాం కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగానే...నిష్పక్షపాతంగానే జరిగిందన్న నాయని దోషులెవరైనా...రాజకీయ నేతలైనా క్షమించేది లేదని స్పష్టం చేశారు.
విందులో వీళ్లే....
కాగా నయీంతో విందు వినోదాల్లో పాల్గొన్న వారిని గుర్తించారు కూడా. కౌంటర్ ఇంటలిజెన్స్ చంద్ర శేఖర్, మలక్ పేట్ ట్రాఫిక్ సీఐ వెంకట్ రెడ్డి , సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న , సీఐడీ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మద్ది పాటీ శ్రీనివాస్ ల ఫొటోలు బాహ్య ప్రపంచంలో వెలుగు చూశాయి. అయినా హోంమంత్రి మాత్రం ఫొటోలు ఆధారం కావంటున్నారు. పోలీసు, రాజకీయ నేతల సహకారంతోనే నయీం విచ్చలవిడిగా సెటిల్ మెంట్లు , దందాలు చేశాడని పోలీసు లే చెప్పారు. నయీం ఒక్కడి వల్ల ఇంతటి నేరసామ్రాజ్యం ఎదగదని వారు ఒప్పుకుంటున్నారు. కాని ఆధారాలు మాత్రం లభించడం లేదని చెబుతున్నారు. తాజాగా హోంమంత్రి ప్రకటనతో నయీం కేసు అటకెక్కినట్లేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
- Tags
- నయీం పోలీసులు