కంత్రీ డాక్టర్ కబ్జా లీలలు
ఆస్పత్రి కోసం అద్దెకు తీసుకోవడం డాక్యుమెంట్ లను ఫోర్జరీ చేసి యజమానులను వేధిస్తున్న కంత్రీ డాక్టర్ ఆగడాలకు సైబరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు.అద్దె అగ్రీమెంట్లను ఫోర్జరీ చేసి సేల్ డీడ్ లుగా మార్చి మోసానికి పాల్పడుతున్న వైద్యుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గుంటూరు లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన బండ్లమూడి బసవేశ్వరరావు బెంగళూరు యూనివర్సిటీలో 2002లో బీడీఎస్ పూర్తి చేశాడు. పలు ఆసుపత్రుల్లో పనిచేసి నగరానికి వలస వచ్చాడు.
అద్దెకు తీసుకున్న భవనాన్నే....
మాదాపూర్ విఠల్ రావునగర్లో ప్రధాన రోడ్డులో భవనం రెండో అంతస్తులో డెంటల్ ఆసుపత్రి ఏర్పాటుకు అద్దెకు కావాలని భవన యజమాని నారాయణరెడ్డిని కోరాడు. నెలకు రూ.70వేల అద్దె, రూ.1.15లక్షలు అడ్వాన్స్ ఇచ్చేందుకు బసవేశ్వర్ అంగీకరించాడు. దీంతో బసవేశ్వర్ రూ.వంద స్టాంపు పేపరుపై రూ.1.15లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లుగా రాసి భవన యజమాని నారాయణరెడ్డి సంతకం తీసుకున్నాడు. అనంతరం సదరు భవనంలో ఆసుపత్రి ప్రారంభించి బసవేశ్వర్ నెలవారీ అద్దె ఇవ్వడం లేదు. నారాయణరెడ్డి అతన్ని నిలదీయగా సదరు భవనం తాను రూ.41 లక్షలకు కొనుగోలు చేశానని, అందుకు సంబంధించిన ఒప్పందం కాగితాలను చూపించాడు.కంగుతున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన చేత రెంటల్ అగ్రిమెంట్ కాగితాలపై సంతకాలు చేయించుకున్న బసవేశ్వర్ సదరు పత్రాలను ఫోర్జరీ చేసి సేల్ అగ్రిమెంట్గా మార్చాడని అతను 2014లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సేల్ అగ్రిమెంట్ పత్రాలపై నగదు అంకెలు రాసే సమయంలో అంకెల మధ్య కొంత దూరం వదిలి రాసిన బసవేశ్వర్ రూ.1 లక్షకు ముందు 4 అనే సంఖ్యను చేర్చి దాన్ని 41 లక్షలుగా మార్చాడు.
ఎట్టకేలకు అరెస్ట్....
అప్పట్నుంచి పరారీలో ఉన్న డాక్టర్ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.గతంలో కేపీహెచ్బీలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని, అలాగే గుంటూరు పట్టణంలో షేక్ జహనరాను మంగళగిరిలో సి.హెచ్.కృష్ణారావు అనే వ్యక్తులను ఇదే తరహాలో మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అగ్రిమెంట్ లు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.