ఉన్నమాటంటే ఉలుకెందుకు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చారని ఇప్పుడు తెలుగుదేశం నేతలు వాపోతున్నారు. కాని కొన్నేళ్ల నుంచి పవన్ చేస్తున్న కామెంట్స్ పై మాత్రం వారు ఆనందపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తి కాలం రాజకీయ నేతగా మారారు. గతంలో సినిమాలతో బిజీగా ఉండి పట్టించుకోని పవన్ కల్యాణ్ ప్రస్తుతం అవి మానేసి పూర్తి కాలం రాజకీయాలకే తన సమాయన్ని వెచ్చిస్తారని చెప్పారు. పార్టీ ప్లీనరీలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివినట్లుగా ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. కాని దీనిపై జనసేన వర్గాలు మండిపడుతున్నాయి.
అప్పుడు ఎంజాయ్ చేశారే....
నాలుగేళ్ల నుంచి పవన్ వ్యాఖ్యలను హ్మాపీగా తీసుకుని ఎంజాయ్ చేసిన టీడీపీ నేతలకు ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు ఎందుకు చికాకు కల్గిస్తున్నాయని చెప్పారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అనేకసార్లు కలిసినప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని నేరుగా ఆయన దృష్టికే తీసుకొచ్చారని, కాని చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లనే ఇప్పుడు పవన్ అన్ని విషయాలను బయటపెట్టాల్సి వచ్చిందని జనసేన నేతలు చెబుతున్నారు. వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయని, పొగిడితేనే మంచి వాళ్లవుతారా? లేకుంటే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివిన వాళ్లవుతారా? అని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
అందుకే భద్రత పెంచాలని అడిగారా?
పవన్ కల్యాణ్ టీడీపీపైన, లోకేష్, చంద్రబాబుపైన ధ్వజమెత్తాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. అందుకోసమే ఆయన ప్లీనరీకి ముందు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఒక లేఖ కూడా రాశారు. తనకు ప్లీనరీ సందర్భంగా ఎలాంటి భద్రత కల్పిస్తున్నారో...అదే భద్రతను ప్లీనరీ ముగిసిన తర్వాత కూడా కొనసాగించాలని డీజీపీని కోరారు. అంటే పవన్ ముందుగానే టీడీపీ నేతలు తనను టార్గెట్ చేసే అవకాశముందని ముందుగానే ఊహించారని జనసేన నేతలు చెబుతున్నారు. అయితే పవన్ వాస్తవాలనే మాట్లాడారని, పవన్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎవరో వెనకఉన్నారని టీడీపీ నేతలు మాట్లాడుతుండటమే అవినీతి ఆరోపణలు వాస్తవమని చెప్పకతప్పదంటున్నారు జనసేన నేతలు.
విజయవాడలోనే పవన్.....
కాగా పవన్ కల్యాణ్ ప్లీనరీ ముగిసినా విజయవాడలోనే మకాం వేశారు. ఎన్ఆర్ఐలతో సమావేశమైన పవన్ తర్వాత వామపక్ష పార్టీల నేతలతో చర్చించారు. ప్రత్యేకహోదాపై ఉద్యమం ఎలా ముందుకు తీసుకెళితే బాగుంటుందని వారితో చర్చించారు. వామపక్ష పార్టీలతో కలసి హోదా ఉద్యమాన్ని చేయాలని పవన్ నిర్ణయించారు. కలిసి వచ్చే పార్టీలను కూడా కలుపుకుని వెళదామని వామపక్ష నేతలు చెప్పడంతో అందుకు పవన్ అంగీకరించారు. ఈరోజు గుంటూరులో అతిసారతో బాధపడి ఆస్పత్రి పాలయిన వారిని పవన్ పరామర్శించనున్నారు.
- Tags
- పవన్ కల్యాణ్
