ఇదేనా బంగారు తెలంగాణ......?

కూృర మృగాలు సైతం సిగ్గు పడేలా తెలంగాణ అటవీ అధికారులు ఆదివాసీ గూడెన్ని ధ్వంసం చేసిన తీరు తీవ్ర విమర్శల పాలైంది........ అడవీ తల్లిని నమ్ముకోవడమే వారు చేసిన పాపమైంది.....ఆడ వాళ్లు.... పసిపిల్లలు అనే కనికరం కూడా లేని కరకు ఖాకీ క్రౌర్యంతో నిర్ధాక్షణ్యంగా నలిపి పారేశారు. మైదానాలతో మాకేంటి పని అడవి తల్లి చాటున హాయిగా బతికేస్తామనుకోవడమే వారు చేసిన పాపమైంది. చావైనా బతుకైనా అడవి తల్లి ఒళ్లొనే అనుకున్నందుకు ప్రత్యక్ష నరకాన్ని చూపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం లవ్వాల గ్రామ శివార్లలోని జలగలంచ తండాపై అటవీ సిబ్బంది విరుచుకుపడ్డారు. అడవిని వదలి మైదాన ప్రాంతాలకు తరలి వచ్చేందుకు నిరాకరిస్తున్నారనే కారణంతో 250మంది సిబ్బంది., ట్రాక్టర్లు., బుల్డోజర్లతో గొత్తికోయ తండాపై విరుచుకుపడి విధ్వంసం సృష్టించారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళల్ని చెట్లకు బంధించారు. 36 గుడిసెలను నేలమట్టం చేశారు.
పోడు వ్యవసాయం చేస్తున్నారని.....
గొత్తి కోయలు సాగు చేస్తున్న మొక్కజొన్న., వరి., ఇతర పంటల్ని ట్రాక్టర్లతో దున్నించి నేలమట్టం చేశారు. రేషన్ సరుకుల్ని నేలపాలు చేసి కిరాకతంగా ప్రవర్తించారు. అడవిని విడిచి బయటకు రావాలంటూ మగవాళ్లను చితకబాదారు. గుడిసెల్ని కూల్చొద్దని వేడుకున్నా కనికరం లేకుండా ప్రవర్తించారు. 15-20 ఏళ్ల క్రితం చత్తీస్ఘడ్ అటవీ ప్రాంతం నుంచి వలస వచ్చిన గొత్తికోయలు జలగలంచ అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో చాలామంది కూలీపనులు చేసుకుంటున్న వారే. మరికొందరు పోడు వ్యవసాయం చేస్తున్నారు. తాడ్వాయి సమీపంలో వారిని తరలించాలని ప్రయత్నించినా వారంతా అడవిలో ఉంటామని మొండికేయడంతో బలవంతంగా తరలించాల్సి వచ్చిందని అటవీ అధికారులు సమర్ధించుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం వారిని భద్రాచలం సమీపానికి తరలించినా కొద్ది రోజులకే మళ్లీ అడవిలోకి వెళ్లిపోయారు. తాజాగా జలగలంచను ఖాళీ చేసే పేరుతో అటవీ సిబ్బంది కూృరంగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
- Tags
- బంగారు తెలంగాణ