Wed Feb 04 2026 23:23:40 GMT+0000 (Coordinated Universal Time)
KTR : తెలంగాణ గళం వినిపించేది బీఆర్ఎస్ మాత్రమే
తెలంగాణ గళం వినిపించేది బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

తెలంగాణ గళం వినిపించేది బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, మళ్లీ అబద్ధాలు చెప్పి హామీలను తుంగలో తొక్కాలని ప్రయత్నిస్తుందన్నారు. ఆరు గ్యారంటీలు వందరోజుల్లో అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో చర్చ ప్రారంభమయిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేశారని, కాంగ్రెస్ మాత్రం ఇచ్చిన హామీలను మాత్రం అమలు పర్చకుండా మోసం చేస్తుందన్నారు.
తప్పుడు ప్రచారం చేస్తూ...
కేసీఆర్ అంటేనే తెలంగాణ అని, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నేతలపై జరుగుతున్న దాడులను కేటీఆర్ ఖండంచారు. పార్లమెంటులో బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ మనుగడకు ఇబ్బంది ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీవి అన్నీ చిల్లర రాజకీయాలంటూ కొట్టి పారేశారు. అప్పులు.. దుబారా అంటూ తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక్క పనైనా చేసిందా? అని ఆయన ప్రశ్నించారు. దివాలాకోరు రాజకీయాలు చేయడం మానుకుని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుపర్చడంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
Next Story
