Fri Dec 05 2025 18:29:46 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాలలో వాతావరణంలో మార్పులు
తెలంగాణ, ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు

తెలంగాణ, ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది.
తెలంగాణలో ఎండలు రోజురోజుకూ పెరిగిపోతూ ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేట్లో 18.3 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. చాలాచోట్ల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సీయస్ అధికంగా నమోదు అయింది. ఆదిలాబాద్లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతాచోట్ల ఒక డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గతేడాదిలాగే వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలో రాత్రిపూట చల్లగా ఉన్నప్పటికీ పగటిపూట వేడిగా ఉంటుంది.
Next Story

